అక్షరటుడే, వెబ్డెస్క్ : Indigo Flight | దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరున్న ఇండిగో బుధవారం భారీగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100కు పైగా విమానాలు రద్దు కావడం సంచలనంగా మారింది.
ముఖ్యంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) నుంచే 40 ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముందస్తు సమాచారం లేకుండా కొచ్చిన్ విమానం రద్దు చేయడంతో అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయం వద్ద ఆందోళనకు దిగిన వారు విమానయాన సంస్థ (Airline) అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. భద్రతాధికారులు జోక్యం చేసుకుని, రీషెడ్యూల్ చేసిన సర్వీసుల ద్వారా భక్తులను గమ్యస్థానాలకు పంపిస్తామని చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Indigo Flight | ఇంకా 48 గంటలు ప్రభావం
ఇండిగో ప్రకారం, ఈ అంతరాయం 48 గంటలు కొనసాగే అవకాశముంది. దీనివల్ల గురువారం కూడా శంషాబాద్ నుంచి 36 విమానాలు రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రకటించారు. సర్వీసుల రద్దుకు ప్రధాన కారణాలుగా ఇండిగో కొన్ని అంశాలను సూచించింది. సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, పెరిగిన విమాన రద్దీ, సిబ్బంది రోస్టర్ అప్డేట్స్, డీజీసీఏ కొత్త నిబంధనల వల్ల పైలట్లపై వచ్చిన ఒత్తిడి. ప్రత్యేకంగా, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పైలట్లకు సంబంధించిన విధుల సమయ పరిమితి (FDTL) నిబంధనలను కఠినతరం చేయడంతో పైలట్ల అందుబాటు తగ్గిపోయిందని ఇండిగో పేర్కొంది.
ఏఎల్పీఏ (ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) మాత్రం వేరే కోణాన్ని సూచించింది. ఇండిగోలో వనరుల వినియోగ ప్రణాళికలోపమే సమస్యకు అసలు కారణమని, సిబ్బంది నిర్వహణలో గందరగోళం ఏర్పడటంతో ఈ రద్దు జరిగిందని పేర్కొంది. ఇండిగో భారీగా విమానాలు రద్దు చేయడంతో, డీజీసీఏ విచారణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ఇండిగోకు నోటీసులు పంపినట్లు ప్రకటించింది. అయితే విమానాలు రద్దు వలన ప్రయాణీకులు (Passengers) తీవ్ర ఇబ్బందులుకి గురయ్యారు. చా లామంది రైళ్ల కోసం పరుగులు తీశారు. ఇండిగో సేవల్లో ఏర్పడిన ఈ భారీ అంతరాయం దేశవ్యాప్తంగా వేలాది ప్రయాణీకులను కలవరపరిచింది.
