అక్షరటుడే, వెబ్డెస్క్: IND vs SA | రెండో వన్డేలో భారీ స్కోరు నమోదైనప్పటికీ బౌలింగ్ విభాగంలో చోటుచేసుకున్న వైఫల్యం కారణంగా భారత జట్టుకు ఓటమి తప్పలేదు. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచినప్పటికీ దక్షిణాఫ్రికా South Africa దూకుడుగా ఆడి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఛేదనలో మార్క్రమ్ బ్రీట్జ్కే, బ్రెవిస్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సఫారీలు చేరుకున్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ 1-1తో సమమైంది. చివరి మ్యాచ్ ఈనెల 6న వైజాగ్లో జరగనుంది.
IND vs SA | దక్షిణాఫ్రికా ధాటికి భారత బౌలర్లు తేలిపోయారు
ఛేదనలో 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా అనంతరం మ్యాచ్పై పట్టు సాధించడం ప్రారంభించింది. బవుమా (46), మార్క్రమ్ (110) కలిసి రెండో వికెట్కు 101 పరుగులు జోడించి బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా మార్క్రమ్ భారత బౌలర్లపై విరుచుకుపడుతూ నిలకడగా ఆడి తన నాలుగో వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతడికి 18వ ఓవర్లో లైఫ్ రావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.
లాంగాన్ వద్ద జైస్వాల్ Jaiswal క్యాచ్ జారవిడవడంతో మార్క్రమ్ కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. సెంచరీ చేసిన మార్క్రమ్ ఔటైన తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ దూకుడుగా ఆడాడు. 34 బంతుల్లోనే 54 పరుగులు చేసి మ్యాచ్ను సఫారీల వైపు తిప్పాడు. బ్రెవిస్, బ్రీట్జ్కే (68) కలిసి 92 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసి విజయానికి పునాది వేసారు.
చివర్లో కార్బిన్ బాష్ (29*) అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా విజయం లాంఛనంగా పూర్తి అయింది.భారత్: 50 ఓవర్లు – 358/5 పరుగులు చేయగా (రుతురాజ్ 105, కోహ్లీ 102, రాహుల్ Kl Rahul 66*, యాన్సెన్ 2/63), దక్షిణాఫ్రికా: 49.2 ఓవర్లు – 362/6 తో భారీ టార్గెట్ ఛేజ్ చేసింది. (మార్క్రమ్ 110, బ్రీట్జ్కే 68, బ్రెవిస్ 54, అర్ష్దీప్ 2/54).
ఇక మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలోనే జైస్వాల్(22), రోహిత్ శర్మ(14) వికెట్లు కోల్పోయి ఒత్తిడి లో పడింది. కానీ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. రుతురాజ్ వన్డేల్లో తొలి సెంచరీని నమోదు చేస్తూ 105 పరుగులు చేశాడు.
అతని ఆటతీరు దేశవాళీలో చూపిన ఫామ్ను గుర్తు చేసింది. మరోవైపు కోహ్లీ తన కెరీర్లో 53వ వన్డే సెంచరీని నమోదు చేస్తూ మరోసారి తన విలువను చాటాడు. మూడో వికెట్కు ఇద్దరూ 195 పరుగుల భాగస్వామ్యం చేసి మంచి పునాది వేశారు. ఆఖర్లో కెప్టెన్ రాహుల్ 66 నాటౌట్ ఇన్నింగ్స్ ఆడి భారత్ను 350 దాటేలా చేశాడు.
