అక్షరటుడే, వెబ్డెస్క్ : Hanmakonda | ప్రస్తుతం చాలా మంది తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన అమ్మనాన్నలను వయసు మీద పడ్డాక పలకరించడం కూడా మానేస్తున్నారు. వారి ఆస్తులు తీసుకుంటున్న పిల్లలు.. బాగోగులు మాత్రం మర్చిపోతున్నారు. ఇలాగే తనను పట్టించుకోని ఓ కుమారుడికి తండ్రి షాక్ ఇచ్చాడు.
కొడుకు పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి తన రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ఆ స్థలంలో తన భార్య జ్ఞాపకార్థం ఒక భవనం నిర్మించాలని కోరారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల (Elkathurthi Mandal) కేంద్రంలో చోటు చేసుకుంది. ఎల్కతుర్తికి చెందిన గోలి శ్యాంసుందర్ రెడ్డి, వసంత దంపతులు. శ్యాంసుందర్ రెడ్డి గతంలో ఎంపీపీగా పని చేశారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు వివాహం చేయడంతో అమెరికాలో ఉంటుంది. కుమారుడు హన్మకొండలో ఉంటున్నాడు.
Hanmakonda | ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో..
శ్యాంసుందర్రెడ్డికి పది ఎకరాల మామిడి తోట, ఎల్కతుర్తి, హనుమకొండలో (Hanmakonda) ఇల్లు ఉన్నాయి. ఆయన భార్య వసంత 2021లో కరోనాతో చనిపోయింది. అప్పటి నుంచి ఆయన తన కుమారుడి వద్ద ఉంటున్నాడు. అయితే ఇటీవల తల్లి పేరు మీద ఉన్న భూమిని, హనుమకొండలోని ఇంటిని శ్యాంసుందరెడ్డి కుమారుడు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం తండ్రిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో ఎల్కతుర్తిలో ఆయన ఒంటరిగా జీవిస్తున్నాడు.
Hanmakonda | గుణపాఠం కావాలని..
కుమారుడిలో మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందిన శ్యాంసుందర్ రెడ్డి తనకు ఉన్న మూడు ఎకరాల భూమిని (సుమారు రూ. మూడు కోట్లు) ప్రభుత్వానికి దానంగా ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ మేరకు రెవెన్యూ అధికారులను (Revenue Officers) కలిసి సంబంధిత పత్రాలు రాయించి, సంతకాలు కూడా చేశాడు. దాని కాపీని తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar Office) అందించాడు. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు తన నిర్ణయంతో కనువిప్పు కలగాలని ఆయన అన్నారు. ఆ స్థలంలో తన భార్య పేరిట ఏదైనా భవనం నిర్మించాలని ఆయన కోరారు.