అక్షరటుడే, మెండోరా: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriram sagar Project) వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా జలాశయంలోకి ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 37 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులోకి 2,36,460 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అధికారులు 2,37,730 క్యూసెక్కుల నీటినిదిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1090.90 అడుగులు (80.053 టీఎంసీలు) నీటినిల్వ ఉంది.
Sriram Sagar | కాల్వల ద్వారా..
వరద నీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు నుండి ఆయా కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ (kakatiya kaluva) ద్వారా 4,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, అదనంగా 709 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతోంది. మొత్తం 1,87,730 క్యూసెక్కుల నీరు వరద గేట్ల ద్వారా నీరు విడుదల జరుగుతోంది.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలని సూచన..
ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో గోదావరి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపర్లు, జాలర్లు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
