అక్షరటుడే, వెబ్డెస్క్ : Heart Attack | పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. తన కూతురి పెళ్లిని ఓ మహిళ ఘనంగా నిర్వహించింది. బిడ్డను అత్తరింటికి పంపే సమయంలో గుండెపోటుతో కుప్పకూలింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లో చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలం(Kamepalli Mandal) అబ్బాసుపురం తండాకు చెందిన బానోతు మోహన్లాల్, కల్యాణి(38) దంపతులు. వీరికి కుమార్తె సింధుకు టేకులపల్లి మండలం కొత్తతండాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు. ఆదివారం పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించారు. అనంతరం కూతురిని అత్తగారింటికి పంపే సమయంలో కల్యాణి భావోద్వేగానికి గురైంది. ఆ సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. హార్ట్ ఎటాక్తో కుప్పకూలిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.
Heart Attack | కలవర పెడుతున్న గుండెపోట్లు
దేశంలో ఇటీవల గుండెపోట్లు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. యువకులు సైతం హార్ట్ ఎటాక్(Heart Attack)తో మృతి చెందుతున్నారు. మారుతున్న జీవనశైలితో గుండెపోటు కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.గతంలో హార్ట్ ఎటాక్ వచ్చినా.. హాస్పిటల్కు వెళ్లే వరకు సమయం ఉండేది. కానీ ప్రస్తుతం అప్పటి వరకు బాగానే ఉండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపే మృతి చెందుతున్నారు.