అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Houses | రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మొదటి దశలో ఇళ్లు మంజూరైన వారు పనులు చేపడుతున్నారు. కొందరు లబ్ధిదారుల ఇళ్లు పూర్తికావడంతో గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పట్టణ ప్రాంతంలో సైతం ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. మూడేళ్లలో పల్లెలతో పాటు అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
పట్టణాల్లో స్థల కొరత దృష్ట్యా జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇచ్చే సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తుందన్నారు. త్వరలో రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతాయని చెప్పారు. ఏప్రిల్ నాటికి రెండో విడత ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పారు.
Indiramma Houses | తప్పు చేస్తే శిక్ష తప్పదు
ప్రజా ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని మంత్రి పొంగులేటి అన్నారు. పొంగులేటి కుమారుడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దానిపై ఆయన స్పందించారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిజాలు తేలుస్తారన్నారు. తప్పు చేస్తే తన కొడుకైనా, తానైనా శిక్ష పడుతుందన్నారు.
