HomeతెలంగాణCM Revanth Reddy | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. వసతి గృహాలకు నిధుల విడుదల

CM Revanth Reddy | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. వసతి గృహాలకు నిధుల విడుదల

CM Revanth Reddy | సంక్షేమ హాస్టళ్లకు తెలంగాణ ప్రభుత్వం రూ.60 కోట్ల నిధులను కేటాయించింది. అత్యవసర పనుల నిమిత్తం వాటిని వినియోగించుకోవచ్చని తెలిపింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వ‌స‌తి గృహాల్లో (Hostels) అత్యవసర పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు కేటాయించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.60 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో డైట్ ఛార్జీలు (Diet charges), తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనుల కోసం రూ.60 కోట్లు కేటాయించారు. ఈ మేరకు సంబంధిత చెక్కులను సీఎం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది హాజరు కోసం ముఖ గుర్తింపునకు (Iris) ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా, జవాబుదారీతనం ఉండాలని చెప్పారు.

CM Revanth Reddy | పోషకాహారం అందించాలి

విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్‌ను ఉప‌యోగించాలని సీఎం సూచించారు. పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో స‌క్ర‌మంగా అందేలా సీనియర్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వ‌స‌తులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.

CM Revanth Reddy | ఆస్పత్రులతో అనుసంధానం చేయాలి

హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని సూచించారు. వసతి గృహాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఆదేశించారు.

సమీక్షకు ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ హాస్టళ్లలోని పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.