అక్షరటుడే, వెబ్డెస్క్ : Indigo Flights | ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంతో దేశంలో విమాన ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వందలాది విమానాలు (Flights) రద్దు అయ్యాయి. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి ఈ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
FDTL నిబంధనలతో ఇండిగో ఎయిర్లైన్స్లో సమస్య నెలకొంది. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని డీజీసీఏ (DGCA) ఆ నిబంధనలు సవరించింది. దీనిపై తాజాగా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. DGCA ఇచ్చిన ఆదేశాలను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొంది. రద్దయిన ఫ్లైట్లకు పూర్తి రీఫండ్ చెల్లించాలని సూచించింది. ప్రయాణికులకు వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
Indigo Flights | దర్యాప్తు కమిటీ ఏర్పాటు
ఇండిగో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) శుక్రవారం అధికారులతో సమీక్షించారు. డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ సంజయ్ కే బ్రహ్మానే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సీనియర్ ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాన్గ్లిక్, ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ లోకేష్ రాంపాల్ తో కూడిన కమిటీని నియమించారు.
Indigo Flights | అప్రమత్తంగా ఉండాలి
ఇండిగో విమానాల రద్దు, జాప్యాల కారణంగా తలెత్తే పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఆదేశించారు. ప్రయాణీకులకు సకాలంలో సమాచారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని విమానాశ్రయాల నుంచి రియల్-టైమ్ అప్డేట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా వివిధ టెర్మినల్స్లో చిక్కుకున్న ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు. విమానాశ్రయ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, ATC నుంచి డేటాను ఏకీకృతం చేసి అన్ని విమానయాన సంస్థలతో, ముఖ్యంగా ఇండిగోతో పంచుకుంటున్నారు.
Indigo Flights | ఎందుకీ పరిస్థితి
దేశంలో ఎప్పుడు కూడా ఎయిర్లైన్స్ ఇంత పెద్ద సమస్య రాలేదు. వందలాది విమానాలు రద్దు కావడంతో చాలా మంది ప్రయానికులు ఎయిర్పోర్టుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో ప్రకారం – ప్రభుత్వ సిబ్బంది భద్రతా నిబంధనల నేపథ్యంలో రోస్టర్ ప్లానింగ్లో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇండిగో రోజుకు దాదాపు 2,300 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది. నవంబర్ 1 నుంచి కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) అమలు తర్వాత విమానయాన సంస్థలు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపాయి. దీంతో సమస్య ఏర్పడింది. అయితే దేశీయ విమానరంగంలో ఇండిగో దాదాపు 70శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. దీంతో సమస్య తీవ్రతరం అయి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
