అక్షరటుడే, వెబ్డెస్క్ : Kranti Goud | ఓ చిన్న గ్రామం నుంచి ఆరంభించిన అమ్మాయి, ప్రపంచకప్ వేదికపై పాకిస్తాన్పై భారత జట్టుకు విజయాన్ని అందించడం దేశానికి గర్వకారణంగా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రాంతి గౌడ్ పేరు హాట్టాపిక్గా మారింది. ఆమె విజయంతో అనేక గ్రామీణ బాలికలు తమ కలల దిశగా అడుగులు వేయడానికి ప్రేరణ పొందుతున్నాయి.
“నువ్వు అమ్మాయివి.. మగవాళ్ల ఆట ఏంటి?” అని గ్రామస్థుల మాటలను లెక్కచేయకుండా తన కలను సాకారం చేసుకున్న మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్ ఇప్పుడు దేశం గర్వించే పేరు తెచ్చుకుంది. ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2025లో భారత్–పాకిస్తాన్ పోరులో అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు విజయాన్ని అందించి, “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు గెలుచుకుంది. భారత్, పాకిస్తాన్ మధ్య పోటీ అంటే ఎప్పుడూ ఉత్కంఠే. ఈసారి కూడా అదే జరిగింది. వరల్డ్కప్ చరిత్రలో వరుసగా ఐదోసారి భారత్ మహిళల జట్టు పాకిస్తాన్(Pakistan)పై విజయం సాధించింది. అయితే ఈ విజయానికి మూలకారణం 22 ఏళ్ల యువ పేసర్ క్రాంతి గౌడ్ చూపించిన అద్భుత ప్రదర్శనే.
Kranti Goud | ఇది కదా టాలెంట్..
ఆరంభంలోనే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసిన క్రాంతి (Kranthi Goud), తన స్పీడ్ మరియు ఖచ్చితత్వంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ను కుదిపేసింది. ఎనిమిదో ఓవర్లో సదఫ్ షమ్స్ను ఔట్ చేస్తూ మొదటి వికెట్ తీసుకుంది. ఆ తర్వాత 12వ ఓవర్లో ఆలియా రియాజ్ను పెవిలియన్కి పంపింది. మధ్యలో భాగస్వామ్యం పెరుగుతుందనగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మళ్లీ ఆమెను బౌలింగ్కి తీసుకొచ్చింది. అప్పుడు క్రాంతి తొలి బంతికే నటాలియా పర్వేజ్ను ఔట్ చేసి పాకిస్తాన్ ఇన్నింగ్స్ను కుదిపేసింది. మొత్తం 10 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన క్రాంతి ప్రదర్శన టీమిండియాకు విజయాన్ని సులభతరం చేసింది. బ్యాటింగ్లో కూడా చివరి ఓవర్లలో రెండు కీలక బౌండరీలు కొట్టి జట్టు స్కోర్ను పెంచడంలో భాగస్వామ్యమైంది.
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా(Chhatarpur District)లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన క్రాంతి కథ నిజంగా స్ఫూర్తిదాయకం. చిన్నతనం నుంచే బౌలింగ్పై ఆసక్తి చూపిన ఆమెకు కుటుంబం నుంచే ప్రోత్సాహం లభించింది. తండ్రి పోలీస్ ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా ఆమె కలలకి బ్రేక్ వేయలేదు. గ్రామస్థుల విమర్శల నడుమే ఆమె తన మార్గంలో ముందుకు సాగింది. స్థానిక టోర్నమెంట్లో తొలి మ్యాచ్లోనే 3 వికెట్లు తీసి, 25 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఆ టోర్నమెంట్లోనే ఆమె టాలెంట్ను గుర్తించిన కోచ్ రాజీవ్ బిల్ఠారే, ఆమెను అకాడమీలో చేర్చి ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు అంతర్జాతీయ పోటీలలో కూడా అదరగొడుతూ అందరి ప్రశంసలు అందుకుంటుంది.