అక్షరటుడే, ఆర్మూర్/నిజాంసాగర్ : Projects | రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. దీంతో ప్రాజెక్ట్లకు వరద పోటెత్తింది. ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్ట్లకు ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తుండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
స్థానికంగా కురిస్తున్న వర్షాలతో శ్రీరామ్సాగర్ (Sriram Sagar)లోకి ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం మధ్యాహ్నం అధికారులు జలాశయం వరద గేట్లు మూసివేశారు. మంగళవారం రాత్రి నుంచి ఇన్ఫ్లో పెరుగుతుండటంతో బుధవారం ఉదయం గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదలను ప్రారంభించారు.
Projects | 8 గేట్లు ఎత్తివేత
శ్రీరామ్సాగర్ 8 వరద గేట్లను ఎత్తి అధికారులు గోదావరి (Godavari)లోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80.053 టీఎంసీల నీరు ఉంది. 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువకు 20 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 3,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 360 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు.
Projects | నిజాంసాగర్ 11 గేట్లు..

మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కుండపోత వాన పడుతోంది. అతి భారీ వర్షాలతో మంజీర (Manjira) నదికి వరద పోటెత్తింది. దీంతో నిజాంసాగర్ (Nizam Sagar) జలాశయంలోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 82,306 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అధికారులు 11 గేట్ల ద్వారా 1,06,161 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.788 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉంది.
Projects | అప్రమత్తంగా ఉండాలి
మంజీరకు వరద కొనసాగుతుండటంతో నిజాంసాగర్ ద్వారా నీటి విడుదలను పెంచే అవకాశం ఉంది. దీంతో దిగువన నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీరామ్సాగర్కు వరద పెరగనుంది. దీంతో గోదావరిలోకి సైతం నీటి విడుదలను అధికారులు పెంచనున్నారు. ఈ క్రమంలో నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.