అక్షరటుడే, వెబ్డెస్క్ : Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టింది. కార్యాలయాల్లో పారదర్శకత, వేగం పెంచే లక్ష్యంతో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షను (computer proficiency test) తప్పని సరి చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా నిబంధన ప్రకారం ఉద్యోగులు కంప్యూటర్ పరీక్షలో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి. జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్-కమ్-టైపిస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, యూడీ టైపిస్టులు, టైపిస్టులు, ఎల్డీ టైపిస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను నిర్వహిస్తున్న ఉద్యోగులు ఈ పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుంది. 2014 మే 12 తర్వాత విధుల్లో చేరిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది.
ఉద్యోగి పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుండానే పోస్టులకు నియమించబడితే వారి ప్రొబేషన్ వ్యవధిలో కంప్యూటర్లు, అనుబంధ సాఫ్ట్వేర్ వాడకంతో ఆఫీస్ ఆటోమేషన్లో ప్రావీణ్యం అనే డిపార్ట్మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.
“కంప్యూటర్ అనుబంధ సాఫ్ట్వేర్ వాడకంలో ఆఫీస్ ఆటోమేషన్లో ప్రావీణ్యం పరీక్ష”ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
