అక్షరటుడే, ఇందూరు: District Registration Office | నిజామాబాద్ నగరంలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏ పని జరగాలన్నా సబ్ రిజిస్ట్రార్ల బినామీలైన డాక్యుమెంట్ రైటర్లదే పెత్తనం. వారికి మొదట ముడుపులు చెల్లిస్తేనే.. తదుపరి సబ్ రిజిస్ట్రార్లు పనిచేస్తారనేది బహిరంగ రహస్యం.
ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏనాడూ అధికారులు కానీ, సిబ్బంది కానీ సమయపాలన పాటించింది లేదు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు అధికారుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన దుస్థితి ఉందనే ఆరోపణలు లేకపోలేదు.
శనివారం క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయని కార్యాలయానికి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు కూడా సబ్ రిజిస్ట్రార్లు రాక ప్రజలు విసిగిపోయారు.
District Registration Office | ఆలస్యంగా వచ్చి..
ఇక ఆలస్యంగా వచ్చిన సదరు అధికారి.. ప్రజలను పట్టించుకోలేదు. డాక్యుమెంట్ రైటర్ల సిబ్బంది తీసుకువచ్చిన ఫైళ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు బాధితులు వాపోయారు.
నిజామాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లదే హవా కొనసాగుతుందనే దానికి శనివారం జరిగిన ఘటనే నిదర్శనం అని స్పష్టం అవుతోంది.
రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వృద్ధులు సైతం అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయారంటే అధికారుల తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ప్రక్షళన చేయాల్సి ఉంది. లేదంటే ప్రభుత్వం, ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజలకు ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుంది.
