అక్షరటుడే, ఇందూరు: Congress | స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడడంతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివిధ స్థాయిల్లో నూతన కమిటీల నియామక ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా డీసీసీ, నగర అధ్యక్ష పదవులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ గత శుక్రవారం ప్రారంభం కాగా.. ఆదివారంతో ముగిసింది. కాగా.. ఈ రెండు పదవులకు పోటాపోటీ నెలకొంది. పార్టీలోని పలువురు నాయకులు దరఖాస్తు చేస్తుకున్నారు. మొత్తం 17 మంది అప్లికేషన్ పెట్టున్నారు.
Congress | డీసీసీ పదవికి..
జిల్లా అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నాయకులు దరఖాస్తులు అందజేశారు. ఇందులో నిజామాబాద్కు చెందిన నరాల రత్నాకర్, చంద్ర శేఖర్ గౌడ్, సాయికుమార్, ఎం.సాయిరెడ్డి, ముజ్జు పటేల్, ఇమ్మడి గోపి, జగడం సుమన్, మహమ్మద్ జనీద్ అక్రమ్, ఎంఏ.హలీం ఉన్నారు. అలాగే ఆర్మూర్కు చెందిన నేత అయ్యప్ప శ్రీనివాస్, బాల్కొండ నుంచి వేణుగోపాల్ యాదవ్ సైతం దరఖాస్తు ఇచ్చారు.
Congress | నగర అధ్యక్ష పదవికి..
ఇక నగర అధ్యక్ష పదవికి సైతం పలువురు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇందులో నరాల రత్నాకర్, గతంలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన గన్రాజ్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామర్తి గోపి, అంతిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, పంచరెడ్డి చరణ్, అలాగే బొబ్బిలి రామకృష్ణ, కౌడిపు శరత్, మహమ్మద్ కైసర్, మహమ్మద్ జనీద్ అక్రమ్ తమ దరఖాస్తులను అందజేశారు. కాగా.. వీరిలో నరాల రత్నాకర్, మహమ్మద్ జనీద్ అక్రమ్లు డీసీసీ, నగర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.
Congress | పీసీసీ, ఏఐసీసీకి వెళ్లనున్న దరఖాస్తులు
డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులను నియమించిన విషయం తెలిసిందే. ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి డీసీసీ అధ్యక్షుడికి అనుకూలమైన అభ్యర్థుల జాబితాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఆయా సామాజిక కోణాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. అనంతరం అర్హులైన వారి జాబితాను పీసీసీ, ఏఐసీసీకి అందజేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. నవంబర్మొదటి వారంలో నూతన అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.