అక్షరటుడే, నిజామాబాద్: Nizamabad city | నిజామాబాద్ నగరంలో (Nizamabad city) అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. కొందరు బడాబాబులు, రియల్టర్లు, రాజకీయ నాయకులు దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండానే భవనాలు పూర్తి చేస్తున్నారు. వీరికి నగర పాలక సంస్థ (Nizamabad municipal corporation) అధికారులు అన్ని రకాల అండదండలు అందిస్తున్నారు. ఇందుకు నగరంలోని ఓ ప్రధాన రోడ్డు వెంబడి నిర్మాణంలో ఉన్న భవనమే ఉదాహరణ.
సామాన్య ప్రజలు చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే అనుమతుల పేరిట మున్సిపల్ అధికారులు హాడావుడి చేస్తారు. అనుమతులు లేవని సామాగ్రి సీజ్ చేయడంతో పాటు నోటీసులు ఇస్తారు. ఇదే అదునుగా అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు డబ్బులు దండుకోవడం సర్వసాధారణం.
అయితే వర్ని రోడ్డులోని (Varni road) ఓ బార్ సమీపంలో ప్రధాన రోడ్డు వెంబడి బీజేపీకి చెందిన నాయకుడు ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం భవనం మొత్తం పూర్తి కావాల్సి వచ్చింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం గమనార్హం. ప్రత్యేకించి ప్రధాన రహదారిని ఆనుకొని ఈ భవన నిర్మాణం జరుగుతున్నా.. మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు.
బీజేపీకి చెందిన సదరు నాయకుడు టీఎస్ బీపాస్ (TS bPASS) కింద ఐదంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతి దరఖాస్తు చేసుకున్నాడు. కాగా.. నిబంధనల ప్రకారం నిర్మాణం జరగట్లేదని క్షేత్రస్థాయి అధికారులు గుర్తించారు. సెల్లార్తో పాటు ఐదంతస్తుల భవనం నిర్మాణం చేపట్టగా డీవియేషన్లు ఉన్నట్లు తేల్చారు. అనంతరం అప్లికేషన్ను కూడా తిరస్కరించి అనుమతులు నిరాకరించారు. ప్రక్రియ అంతా కూడా ఈ ఏడాది మార్చిలోనే జరిగిపోయింది. అయినప్పటికీ.. సదరు నాయకుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దర్జాగా బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తుండడం గమనార్హం.
ఒకవిధంగా నగర పాలక సంస్థలో ఉండే అధికారులే సహకరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఓ డివిజన్కు ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన సదరు నాయకుడు చిన్నపాటి ఇంటి నిర్మాణం చేపట్టినా తనకు ఎంతో కొంత ఇవ్వనిదే పనులు పూర్తి కానిచ్చేవాడు కాదని విమర్శలు ఉన్నాయి. అనమతులు లేని వాటికి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేయగా.. అప్పట్లో పలు ఆడియో రికార్డులు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఏ అధికారం లేకపోయినప్పటికీ.. దర్జాగా అక్రమ నిర్మాణం చేపడుతున్నా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.