అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | చలికాలం దృష్ట్యా రహదారులపై పొగమంచు దట్టంగా అలుముకుని ఉంటుందని.. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మారుమూల రహదారుల్లో ఉదయం 11 గంటల వరకు కూడా పొగమంచు ఉంటుందన్నారు. దీంతో రహదారులపై ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించవని.. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
CP Sai Chaitanya | ద్విచక్ర వాహనాదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పొగమంచు ఉన్న ప్రదేశాల్లో బైకర్లు నెమ్మదిగా వెళ్లాలన్నారు. లోబీమ్ లైట్ను మాత్రమే వాడాలని పేర్కొన్నారు. అవసరం నిమిత్తం ఇండికేటర్లు వాడాలన్నారు. రోడ్డుకు ఎడమ వైపు లేదా కుడివైపు వాహనం తిప్పేటప్పుడు తప్పనిసరిగా ఇండికేటర్లు (Indicators) వాడాలని తెలిపారు. రోడ్డు తడిగా ఉంటే వాహనం స్కిడ్ అయ్యే అవకాశం గలదన్నారు. తప్పనిసరిగా హెల్మెంట్ వాడాలని సీపీ సూచించారు.
CP Sai Chaitanya | ఫోర్ వీలర్ వాహనాలు..
ప్రతి వాహనం వేగం తగ్గించి నెమ్మదిగా నడపాలని సీపీ సూచించారు. ముందున్న వాహనానికి కనీసం 50-100 అడుగుల దూరం ఉండేటట్లు జాగ్రత్త పడాలన్నారు. లో బీమ్ లైట్లు మాత్రమే వాడాలన్నారు. అద్దాలను కొద్దిగా తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. దీని వలన ఫాగింగ్ నివారించవచ్చన్నారు. లైన్ మార్కింగ్లు, రోడ్డు డిఫ్లేక్టర్లను గమనిస్తూ వాహనం నడపాలని చెప్పారు.
