అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా.. ప్రజలు ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. మొదటి దశ నామినేషన్ల (Nominations) పర్వం పూర్తవగా.. రెండో దశ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది.
చాలా గ్రామాల్లో సర్పంచ్ (Sarpanch) పదవి కోసం పోటాపోటీ నెలకొంది. ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గకుండా గెలుపే లక్ష్యంగా కొందరు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తులు అందరు కలిసి చర్చించుకొని ఏకగ్రీవం చేస్తుండగా.. చాలా ప్రాంతాల్లో వేలంపాట, అభివృద్ధికి నిధులు అడగటం ద్వారా ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ సర్పంచ్ పదవి కోసం రూ.73 లక్షలు పెట్టడం గమనార్హం.
Panchayat Elections | నల్గొండ జిల్లాలో..
నల్గొండ జిల్లా (Nalgonda District) చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. నామినేషన్ అనంతరం గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వేలంపాట నిర్వహించారు. ఇందులో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలకు పాడి సర్పంచ్ పదవి దక్కించుకోవడం గమనార్హం. దీంతో మిగతా అభ్యర్థులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. నల్గొండ జిల్లా ములకలపల్లి (Mulakalapalli)లో బొడ్డుపల్లి లింగస్వామి అనే అభ్యర్ధి రూ.19 లక్షలకు వేలంలో సర్పంచ్ పదవి దక్కించుకున్నాడు. ఈ డబ్బులతో గ్రామంలో రామాలయం నిర్మించనున్నారు.
Panchayat Elections | పట్టించుకోని అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులకు వేలంపాట నిర్వహిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వేలంలో పదవులు కొనడం గమనార్హం. అభివృద్ధి, ఆలయాల పేరిట వేలం పాట నిర్వహిస్తున్నా.. అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించడం లేదు. వేలంపాట ద్వారా ఏకగ్రీవం చేసిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.
