అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan Border | ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం అయినప్పటికీ, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఐజీ అశోక్ యాదవ్ (IG Ashok Yadav) వెల్లడించారు.
ఇటీవలే భారత సైన్యం (Indian Army), వైమానిక దళం కలిసి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉన్న అనేక ఉగ్రవాద శిక్షణ శిబిరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వందలాది మంది ఉగ్రవాదులు (Terrorists) ఈ ఆపరేషన్లో హతమైనట్లు సమాచారం.అయితే ఈ దాడుల అనంతరం కూడా నియంత్రణ రేఖ ఆవల కొత్తగా సమూహీకరణ జరుగుతోందని యాదవ్ పేర్కొన్నారు.
Pakistan Border | చొరబాటు ప్రయత్నాలు విఫలం..
మొత్తం 69 ఉగ్రశిక్షణ శిబిరాలు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయని , వాటిలో సుమారు 100–120 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భారత్లోకి చొరబడేందుకు అవకాశాల కోసం ఉగ్రవాదులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన ఒక ఘటనలో, ఎనిమిది మంది ఉగ్రవాదులు నాలుగు విడతల్లో చొరబాటుకు యత్నం చేసినా , బీఎస్ఎఫ్ (BSF) దళాలు అందరి కదలికలను ముందుగానే గుర్తించి, వారిని మట్టుబెట్టినట్లు వివరించారు. సరిహద్దుల్లో ఏ ఉగ్రవాద కదలిక జరిగినా, మా దళాలు వెంటనే గుర్తించే స్థాయికి చేరుకున్నాయి. ఆధునిక పరికరాలు, నైట్ విజన్ సిస్టమ్స్, డ్రోన్ల సహాయంతో 24 గంటల పహారా కొనసాగుతోంది అని ఆయన చెప్పారు.
భారత వైమానిక దళం, సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూరు (Operation Sindoor)లో బీఎస్ఎఫ్ కూడా కీలక పాత్ర పోషించినట్లు అశోక్ యాదవ్ వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లోని పాక్ ఉగ్రవాద శిబిరాలను గుర్తించడం, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇవ్వడం, గ్రౌండ్ కోఆర్డినేషన్ వంటి అంశాల్లో బీఎస్ఎఫ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు.
