అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad CP Sajjanar | హైదరాబాద్ నగరంలో (Hyderabad City) ఇటీవల నేరాలు పెరిగాయి. చోరీలు, దోపిడీలు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు డ్రగ్స్, గంజాయి దందా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) పోలీసులకు పలు కీలక సూచనలు చేశారు.
కీలక కేసుల పర్యవేక్షణ కోసం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (Central Investigation Team) ఏర్పాటు చేయనున్నట్లు సీపీ తెలిపారు. నేరస్తులకు న్యాయస్థానాల్లో కఠిన శిక్ష పడేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. బంజారాహిల్స్లోని (Banjara Hills) టీజీఐసీసీసీ ఆడిటోరియంలో ఆయన నెలవారీ నేరసమీక్షలో మాట్లాడారు. కేసుల నమోదు, దర్యాప్తు వివరాలను తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించాలని సూచించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులను పక్కనపెట్టినా, నేర తీవ్రతను తగ్గించి చూపినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదని స్పష్టం చేశారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.
Hyderabad CP Sajjanar | ఉక్కుపాదం మోపాలి
నగరంలో డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు, ఆన్లైన్ బెట్టింగ్ (online betting) కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్, మహిళా భద్రత, స్ట్రీట్ క్రైమ్, ఆహార కల్తీ కేసులపై ఫోకస్ చేయాలన్నారు. రౌడీ షీటర్లు, పాతనేరస్తులపై నిఘా పెంచాలని సూచించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించి దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. కఠిన శిక్షలు పడినప్పుడే నేరస్తుల్లో భయం ఉంటుందని చెప్పారు. పోలీసులు విధుల్లో ఉన్న సమయంలో వెంట ఆయుధం ఉంచుకోవాలని సూచించారు.
