అక్షరటుడే, వెబ్డెస్క్ : Medaram Jathara | మేడారంలో ఈ నెల 18న సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. తొలిసారిగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా క్యాబినెట్ మీటింగ్ (cabinet meeting) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతరను (Medaram Maha Jatara) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు అభివృద్ధి పనులు చేపట్టింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలను పునర్ నిర్మించింది. ఆయా పనులను ప్రారంభించడానికి సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్లనున్నారు. అక్కడ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. రాత్రి అక్కడే బస చేసి 19న అమ్మవారి గద్దెలను సీఎం ప్రారంభిస్తారు. పొంగులేటి మాట్లాడుతూ.. సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళా కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.
Medaram Jathara | పాలేరులో పర్యటన
పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 18న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆయన అధికారులతో కలిసి సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు.. మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ను ప్రారంభిస్తారని చెప్పారు. కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.