అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad CP | హైదరాబాద్ నగరంలో ఇటీవల నేరాలు పెరిగాయి. చోరీలు, దాడులకు పాల్పడటం, దోపిడీలు, గ్యాంగ్వార్లు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డ్రగ్స్, గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) కీలక చర్యలు చేపట్టారు.
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad) సీపీ సజ్జనార్ పది ప్రధాన ముఠాలకు చెందిన 86 మంది సభ్యులను టీజీఐసీసీసీ (TGICCC)కి పిలిపించి.. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు.
Hyderabad CP | సీపీ వార్నింగ్
నగరంలోని సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ, ప్రత్యర్థి ముఠాలపై దాడులకు తెగబడుతున్న వారిని సీపీ విచారించారు. 86 మందిని కమిషనర్ బైండోవర్ చేశారు. రాబోయే ఏడాది కాలం పాటు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో ఉంటామని వారి చేత బాండ్లు రాయించుకున్నారు.
ఏడాదిలో ఎవరైనా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్ను రద్దు చేయడంతో పాటు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె అపూర్వారావు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
