అక్షరటుడే, వెబ్డెస్క్ : Jaishe Mohammad | పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మరోసారి తన వ్యూహాలను మార్చి భారత భద్రతా వ్యవస్థలకు సవాలు విసురుతోంది. జైష్ చీఫ్ మసూద్ అజార్ (Jaish chief Masood Azhar) నేతృత్వంలో ఇటీవల ప్రారంభమైన మహిళా వింగ్ ‘జమాత్ ఉల్ మోమినాత్’ కొద్ది వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలను రిక్రూట్ చేసుకున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని అజార్ స్వయంగా సోషల్ మీడియా (Social Media)లో ప్రకటించడం కలకలం రేపింది. పాకిస్థాన్లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి వంటి ప్రాంతాల నుంచి భారీగా మహిళలు ఈ విభాగంలో చేరినట్లు తెలుస్తోంది.
Jaishe Mohammad | రూజ.500కే ఆన్లైన్ జీహాద్ కోర్సు
ఉగ్రవాద భావజాలాన్ని మహిళల్లో నాటేందుకు జైషే ఆన్లైన్ క్లాస్లను ప్రారంభించింది. ప్రతి క్లాస్ 40 నిమిషాల పాటు కొనసాగుతుందని, సభ్యత్వం కోసం మహిళలు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఐఎస్ఐఎస్ (ISIS), హమాస్, ఎల్టీటీఈ తరహాలో ఫిదాయిన్ దాడులకు ప్రత్యేక మహిళా బ్రిగేడ్లను సిద్ధం చేయడమే ఈ పథకం వెనుక అసలు ఉద్దేశమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విభాగానికి మసూద్ అజార్ సోదరి సాదియా నాయకత్వం వహించడం మరింత ఆందోళనకరం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ఆమె భర్త యూసుఫ్ అజార్ హతమయ్యాడు.
ఈ మహిళా వింగ్లో కీలక సభ్యురాలిగా పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫిరా వ్యవహరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు (Intelligence Sources) వెల్లడిస్తున్నాయి. ఫరూక్ ఎన్కౌంటర్లో మరణించిన తరువాత ఆమె జమాత్ ఉల్ మోమినాత్లో చేరి శిక్షణ కార్యక్రమాల్లో ముందుండి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మహిళలకు పురుష యోధుల తరహాలోనే ‘దౌరా-ఏ-తస్కియా’ అనే ఇండక్షన్ కోర్సు అందిస్తున్నారు. అలాగే వీరు భర్తలు, అత్యంత దగ్గరి బంధువులు తప్ప ఇతర పురుషులతో మాట్లాడకూడదన్న కఠిన నియమాలను కూడా అమలు చేస్తున్నారు. గత నెలలో ఢిల్లీలో చోటుచేసుకున్న కారు పేలుడులో 13 మంది మరణించిన ఘటన అనంతరం, ఈ మహిళా వింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్టయిన డా. షహీన్ సయీద్కు జమాత్ ఉల్ మోమినాత్తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి. ఈ పరిణామాలతో భారత భద్రతా సంస్థలు మరింత అప్రమత్తం అయ్యాయి.
