అక్షరటుడే, వెబ్డెస్క్ : UPI Payments | డిజిటల్ పేమెంట్స్లో భారత్ ముందువరుసలో ఉంది. యూపీఐ (UPI) సౌలభ్యంతో దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్నాయి. తాజాగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (Unified Payments Interface) మరో కీలక మార్పుకు సన్నద్ధమవుతోంది. పిన్ లేకుండా, బయోమెట్రిక్ ఆధారంగా చెల్లింపులు చేసే ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లావాదేవీల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
UPI Payments | చింత అక్కర్లేదు..
అంటే QR కోడ్ను స్కాన్ చేసిన తర్వాత వేలిముద్ర (Fingerprint), ముఖ గుర్తింపు , కంటిపాప గుర్తింపు (Iris Scan) ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటి వరకూ యూపీఐ చెల్లింపుల కోసం 4 లేదా 6 అంకెల పిన్ అవసరం ఉండేది. అయితే చాలా మంది తమ పిన్ మర్చిపోతారు, మరోవైపు పిన్ వలన మోసం కూడా జరిగే అవకాశం ఉంది. వృద్ధులు, సాంకేతికత తెలియని వారికి పిన్ ఉపయోగించడం కష్టం. ఈ సమస్యలను అధిగమించడానికే బయోమెట్రిక్ ఆధారిత చెల్లింపుల ఫీచర్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. బయోమెట్రిక్ సిస్టమ్ (Biometric System) అత్యంత సురక్షితం కాగా, ఒక్కొక్కరి వేలిముద్ర, ఫేస్ ఐడీ వేరే వేరు కావడంతో మోసం జరగడం అసాధ్యం.
మరో ముఖ్య విషయం ఏంటంటే, బయోమెట్రిక్ ఫీచర్ వచ్చినప్పటికీ పిన్, ఫేస్ ఐడీ(Face ID) అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. యూజర్ తనకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. గ్రామీణులు, వృద్ధులకు ఉపయోగపడేలా దీనిని డిజైన్ చేస్తారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఈ బయోమెట్రిక్ ఫీచర్ఉంది. అధికారికంగా NPCI ఇప్పటివరకు తేదీ ప్రకటించలేదు. అయితే నివేదికల ప్రకారం, కొన్ని నెలల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. భవిష్యత్లో డిజిటల్ చెల్లింపులు మరింత సులభం, సురక్షితం అవుతాయన్నదానికి ఇది గొప్ప ఉదాహరణ.
