అక్షరటుడే, కామారెడ్డి : TPCC : పేలుడు పదార్థాల కేసులో అరెస్టు అయి రిమాండుపై జైలులో ఉన్న టీపీసీసీ జనరల్ సెక్రెటరీ (TPCC General Secretary) గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి కామారెడ్డి (Kamareddy court) కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ మేరకు జైలు నుంచి విడుదలై గురువారం రాత్రి కామారెడ్డికి చేరుకున్న ఆయనకు అనుచరులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
కొత్త బస్టాండ్ నుంచి చంద్రశేఖర్ ఇంటి వరకు భారీగా ర్యాలీ తీశారు. గజమాలతో సత్కరించి భారీ జులూస్ చేపట్టారు. ఇంటికి చేరుకున్న చంద్రశేఖర్ రెడ్డిని పలువురు కలిశారు.
TPCC : పేలుడు పదార్థాల కేసులో..
కేపీఆర్ కాలనీలోని ఓపెన్ ప్లాటులో ఈ నెల 3న బండరాళ్లు పేల్చడానికి సిద్ధంగా ఉంచిన జిలెటిన్స్ స్టిక్స్ (gelatin sticks), డిటోనేటర్ల(detonators)ను పోలీసులు సీజ్ చేశారు. శ్రీవారి వెంచర్ లో సైతం పేలుడు పదార్థాలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వద్ద పేలుడు పదార్థాలు తీసుకున్నారని తేలింది.
TPCC : రాజకీయ కక్షతోనా..!
ఈ క్రమంలో, ఈ నెల 5 న రాత్రి 11 గంటల ప్రాంతంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించగా.. నిజామాబాద్ జైలుకు తరలించారు. కాగా, తన భర్తను రాజకీయ కక్షతోనే సంబంధం లేని కేసులో అరెస్టు చేయించారని చంద్రశేఖర్ రెడ్డి సతీమణి, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆరోపించారు. గురువారం బెయిలు మంజూరు కావడంతో ఎట్టకేలకు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రశేఖర్ శుక్రవారం మీడియా ఎదుటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
