అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైదరాబాద్ నగరంలోని గాజులరామారం (Gajularamaram)లో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) స్పందించారు. గాజులరామారంలో ఆదివారం తెల్లవారుజామున నుంచే అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న విషయం తెలిసిందే.
కుత్బుల్లాపూర్ (Qutubullahpur) నియోజకవర్గంలోని గాజులరామారం సర్వే నంబర్ 307లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం కేటాయించిన ఈ భూమిలో కొందరు షెడ్లు వేయడంతో పాటు వెంచర్ చేసి ప్లాట్లు విక్రయించారు. దీంతో హైడ్రా సిబ్బంది జేసీబీలతో షెడ్లను తొలగించారు. దీనిపై కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణాలను తొలగిస్తున్నామని తెలిపారు.
Hydraa | అధికారులూ కబ్జా చేశారు
గాజులరామారంలో కబ్జాకు పాల్పడిన వారిలో రాజకీయ నాయకులు (Political Leaders), ఉన్నతాధికారులు (Officials) ఉన్నారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 40 ఎకరాల్లో పేదలు ఇళ్లు కట్టుకొని జీవిస్తున్నారన్నారు. పేదల ఇళ్లను కూల్చడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఫీల్డ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
Hydraa | కంచె ఏర్పాటు చేస్తాం
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, అధికారులు ఆక్రమించిన వందల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అధికారులతో స్థానిక నాయకులు కమ్మక్కై కబ్జాలకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. అనంతరం ఆయా భూములను పేదలకు విక్రయించారని చెప్పారు. ఆరు నెలల్లో ఐదు సార్లు తమ సిబ్బంది, రెవెన్యూ అధికారులు అక్కడి స్థానికులతో మాట్లాడమన్నారు. పేదలు నివసిస్తున్న ఇళ్లను తొలగించడం లేదన్నారు. కమర్షియల్ షెడ్లు, ప్రహరీలు, అక్రమంగా నిర్మించిన గదులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. రూ.13 వేల కోట్ల విలువైన 275 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని కంచె ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.