అక్షరటుడే, కామారెడ్డి : MEPMA RP | బ్యాంక్ మేనేజర్తో కలిసి రుణాల రికవరీ కోసం వెళ్లిన మెప్మా ఆర్పీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని అడ్లూర్ గ్రామంలో (Adlur Village) గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
MEPMA RP | రికవరీ కోసం వెళ్తే..
అడ్లూర్ గ్రామానికి చెందిన చంద్రకళ కామారెడ్డి మెప్మాలో (Kamareddy MEPMA) ఆర్పీగా పనిచేస్తోంది. అయితే గురువారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఐవోబీ బ్యాంక్ మేనేజర్ ఆర్పీకి ఫోన్చేసి లోన్ రికవరీ కోసం వెళ్లాలని చెప్పగా ఈ సమయంలో వీలు కాదని చెప్పింది. అయినా రావాల్సిందేనని పట్టుబడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మేనేజర్తో పాటు స్కూటీపై వెళ్లింది. అయితే రుణం చెల్లించే వారి ఇంటికి తాళం వేసి ఉండడంతో మేనేజర్ వెళ్లిపోగా తన స్కూటీపై చంద్రకళ నెమ్మదిగా ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ముఖానికి మాస్కులు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చంద్రకళను వెనకనుంచి తలపై కర్రతో దాడిచేసి పారిపోయారు. స్కూటీపై నుంచి కిందపడిన చంద్రకళ మళ్లీ తేరుకుని ఇంటికి వెళ్లింది. శుక్రవారం తలనొప్పిగా ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి (Government Hospital) వెళ్లగా పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు.
MEPMA RP | ఐసీయూలో చికిత్స..
చంద్రకళ కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి (Private Hospital) శనివారం వెళ్లగా పరిస్థితి సీరియస్గా ఉందని ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తోటి ఆర్పీలు ఆస్పత్రికి చేరుకుని చంద్రకళను పరామర్శించారు. బ్యాంక్ మేనేజర్కు ఫోన్ చేయగా తనకు సంబంధం లేదని, ఎవరికైనా చెప్పుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆర్పీలు తెలిపారు. దాంతో మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డికి (MEPMA PD Sridhar Reddy) ఫోన్ చేసి వివరాలు చెప్పగా తాను మీటింగ్లో ఉన్నానని తెలిపారన్నారు. సమయం తీసుకుని రావాలని కోరగా ఆస్పత్రికి వచ్చి పది నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయాడని ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేశారు.
MEPMA RP | పీడీ స్పందనపై ఆవేదన..
పీడీ పరిధిలో పని చేస్తున్న మహిళా ఆర్పీపై దాడి జరిగితే పీడీ నుంచి సానుకూల స్పందన రాకపోవడం బాధాకరమని ఆర్పీలు వాపోయారు. ఆర్పీ చంద్రకళ చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని, ఆర్పీలందరూ చందాలు వేసుకుని వచ్చిన డబ్బుతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఒక ఆర్పీపై దాడి జరిగితే సంబంధిత మేనేజర్ తనకు ఏ సంబంధం లేదని చెప్పడం సరికాదని, పీడీ తీరు కూడా బాధాకరమని వారన్నారు. దాడికి గురైన ఆర్పీకి న్యాయం చేయాలని, చికిత్సకు అయ్యే ఖర్చు అధికారులు సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా రికవరీ కోసం తమను పిలవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు సెక్యూరిటీ లేదని, తమకు న్యాయం జరిగే వరకు తమ విధులకు హాజరుకాబోమని తేల్చి చెప్పారు. ఈ విషయమై పీడీ శ్రీధర్ రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా తాను వేరే చోట ఉన్నానని బదులిచ్చారు.