అక్షరటుడే, కామారెడ్డి: Neelam Kalavati Ramesh | వార్డు ప్రజలే తన బలం అని, అభివృద్దే తన లక్ష్యమని 10వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం కళావతి రమేష్ (Neelam Kalavati Ramesh) అన్నారు. దేవునిపల్లి గ్రామంలోని తన వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
Neelam Kalavati Ramesh | ఇంటింటికి తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థిస్తూ..
ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. మేనిఫెస్టోకు సంబంధించిన ప్రతులను పంపిణీ చేశారు. గోడప్రతులను ఇంటింటికి అతికించారు. తన గుర్తును ఒకటికి పదిసార్లు చెబుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఆత్మాభిమానం ఉన్న వ్యక్తినని, మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో పొందు పరిచిన ప్రతి హామీని అమలు చేస్తానని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఫలాలను ప్రజలకు నిస్వార్థంగా అందేలా చూస్తానని పేర్కొన్నారు.
అవినీతికి ఆస్కారం లేకుండా..
అవినీతికి ఆస్కారం లేకుండా తన సమస్యలుగా భావించి వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నీలం కళావతి రమేష్ హామీ ఇచ్చారు. గతంలో వార్డులో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం తాను కొనసాగుతున్న పార్టీ అధికారంలో ఉందని, నిధులకు కొరత లేకుండా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహకారంతో వార్డు అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని, అభివృద్ధి చేసే వారికి పట్టం కట్టాలని కోరారు. తనను గెలిపిస్తే వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానని, తన భర్త పెత్తనం ఉండబోదని స్పష్టం చేశారు. ఏ సమస్య అయినా ప్రజలు నేరుగా తనతో చెప్పుకోవచ్చన్నారు. వార్డు ప్రజలకు నిరంతరం సేవలు అందుబాటులో ఉండేలా వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తానని పేర్కొన్నారు. వార్డు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, సమయానికి వైద్యం అందడం కోసం ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. తన కుటుంబం ఏనాడు కూడా ఆస్తులు సంపాదించుకోవాలని తాపత్రయపడలేదన్నారు. అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. నిజాయితీగా పని చేసి చూపించేందుకు చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.