అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Municipal Dry Days | తెలంగాణలోని మందుబాబులకు బిగ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఎన్నికల అధికారులు (Election Officers) ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియనుంది. దీంతో అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని అన్ని వైన్ షాపులు (Wine Shops), బార్లు పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. దాదాపు 48 గంటల పాటు డ్రై డే అమలులో ఉండనుంది.
Telangana Municipal Dry Days | రెండు రోజులు బంద్..
అంతేకాకుండా ఓట్ల లెక్కింపు జరగనున్న ఫిబ్రవరి 13న కూడా మద్యం దుకాణాలు బంద్ చేయాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు మద్యం విక్రయాలు, పంపిణీపై పూర్తిస్థాయి నిషేధం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి మద్యం అమ్మకాలు నిర్వహించినా, బెల్ట్ షాపుల్లో విక్రయాలు చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు (Muncipal Elections) జరిగే ప్రాంతాల్లో మద్యం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్గా మారింది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో 2,582 వార్డులు కలిపి మొత్తం 2,996 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 3న ముగియగా, ఉపసంహరణ గడువు పూర్తయ్యాక ఏకగ్రీవ స్థానాల వివరాలను అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు తెలిపారు. వీటిలో 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 2 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను పరోక్ష విధానంలో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది.