అక్షరటుడే, వెబ్డెస్క్ : YS Jagan | ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల కల్తీ మద్యం (Adulterated alcohol) తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా ములకచెరువులో దాడులు నిర్వహించి రూ.1.75 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత ఎక్స్ వేదికగా స్పందించారు.
మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు నాయుడు (Chandra Babu) ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్ సిండికేట్లు, నకిలీ మద్యం తయారీతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీడీపీ (TDP) నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కిందివరకూ పంచుకుంటున్నారని ఆరోపించారు.
YS Jagan | ప్రభుత్వ దుకాణాలపై విష ప్రచారం
లిక్కర్ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డురాకూడదనే ఉద్దేశంతోనే వ్యూహం ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని జగన్ పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో చంద్రబాబు సిండికేట్లకు అప్పగించారని ఆరోపించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే, బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.