అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 9,654 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.
ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు గోదావరి (Godavari)లోకి విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. కాకతీయ కాలువ (Kakatiya Canal), ఎస్కేప్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ఎస్సారెస్పీ (SRSP) దిగువన గల జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేపడుతున్నారు.
Sriram Sagar | నిజాంసాగర్ ఒక గేటు ఎత్తివేత
అక్షరటుడే, ఎల్లారెడ్డి: నిజాంసాగర్ (Nizam Sagar) ప్రాజెక్ట్లోకి 4,048 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేమొత్తంలో నీటితో నిండుకుండలా ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ఒక గేటు ఎత్తి 4,048 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
Sriram Sagar | యాసంగికి ఢోకా లేనట్లే
ప్రస్తుతం వానాకాలం వరికోతలు జోరందుకున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో రైతులు యాసంగి సాగు పనులు ప్రారంభించనున్నారు. వానాకాలం సీజన్ ముగిసే వరకు కూడా ఉమ్మడి జిల్లాలోని రెండు ప్రధాన జలాశయాలైన శ్రీరామ్ సాగర్, నిజాంసాగర్ నిండుకుండల్లా ఉండటంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటలకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.