అక్షరటుడే, వెబ్డెస్క్: Road Safety Tax | వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) అమలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనాల రేట్లు భారీగా తగ్గాయి. పలు వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18శాతానికి తగ్గించడంతో రేట్లు దిగి వచ్చాయి. దీంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో రేట్లు పెరగనున్నాయి.
Road Safety Tax | మార్చి 1 నుంచి..
కొత్త వాహనాలపై మార్చి 1 నుంచి రహదారి భద్రత పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల రకాలను బట్టి ఈ పన్ను రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండనుంది. ఇది వినియోగదారులపై పడనుంది. దీంతో రేట్లు పెరుగుతాయి. కొత్తగా విధించే ఈ పన్నుతో రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ (Telangana Transport Department) ఉత్తర్వులు జారీ ఏసింది. రోడ్డు భద్రతను మెరుగు పర్చడానికి ఈ పన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Road Safety Tax | పన్ను రేట్లు ఇలా..
ద్వి చక్ర వాహనాలపై రూ.రెండు వేల పన్ను విధించనున్నారు. తేలికపాటి వాహనాలపై రూ.5 వేలు, ఇతర వాహనాలపై రూ.10 వేల ట్యాక్స్ అమలు చేయనున్నారు. కార్లు తేలికపాటి వాహనాల పరిధిలోకి రానుండగా.. 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోలు ఇతర వాహనాల పరిధిలోకి వస్తాయి. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది.
