అక్షరటుడే, మెదక్ : Heavy Rains | మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. చెరువులకు వరద పోటెత్తడంతో అలుగు పారుతున్నాయి.
మెదక్ (Medak) జిల్లా రామాయంపేటలో 316.3 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. నర్సింగి శివనూరులో 289.4, హవేలి ఘన్పూర్లో 287, లక్ష్మాపూర్లో 253.3మి. మీ. వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు గ్రామాలకు వెళ్లే రాహదారులు కొట్టుకుపోయాయి.
Heavy Rains | నిలిచిన రాకపోకలు
మెదక్ – ఎల్లారెడ్డి మార్గంలో నక్కవాగు ఉధృతంగా పారుతోంది. దీంతో ఇటీవల నిర్మించిన జాతీయ రహదారి కొట్టుకుపోయింది. హవేలి ఘన్పూర్ (Haveli Ghanpur) మండలం ధూప్సింగ్ తండాని వరద ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఆ గ్రామానికి వెళ్లే మార్గంలో గంగమ్మ వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో ప్రజలు ఇళ్లపైకి చేరి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తిమ్మాయిపల్లి, నాగపూర్, వాడి గ్రామాలను వరద ముంచెత్తింది. పిల్లికొట్టాల్లో సబ్ స్టేషన్ నీట మునగడంతో జిల్లా కేంద్రంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. హవేలి ఘన్పూర్ మండలంలోని పలు గ్రామాలకు అర్ధరాత్రి నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
Heavy Rains | ప్రమాదకరంగా చెరువు
హవేలి ఘన్పూర్ మండలం బూర్గుపల్లి (Burgupalli) చెరువుకు భారీగా వరద వస్తోంది. ప్రమాదకర స్థితిలో చెరువు అలుగు పారుతోంది. చెరువు కట్టను వరద నీరు తాకడంతో పాటు అలుగు పారిన నీరు రోడ్డు మీదుగా పారుతోంది. దీంతో ఆ మార్గంలో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు తెగిపోయే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వాడి–రాజిపేట గ్రామాల మధ్య గల గంగమ్మ వాగు ఉధృతంగా పారుతోంది.