అక్షరటుడే, వెబ్డెస్క్ : Permanent Tahsildar Offices | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. పారదర్శక పాలన అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
మొదటి దశలో అద్దె ప్రాంగణంలో పనిచేస్తున్న 60 తహశీల్దార్ కార్యాలయాలు, 5 RDO కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలను నిర్మిస్తామన్నారు. రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలను పునర్ నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకేరకంగా నిర్మించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో చర్చించిన తర్వాత డిజైన్లను ఖరారు చేస్తామని చెప్పారు.
Permanent Tahsildar Offices | అధికారులతో సమీక్ష
సచివాలయంలో సీనియర్ రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అద్దె భవనాల్లో పనిచేస్తున్న కార్యాలయాల సంఖ్య, శిథిలావస్థకు చేరిన భవనాల వివరాలు సేకరించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి, అధునాతన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మాణం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజ్గిరి, పటాన్చెరులలో ఇప్పటికే శంకుస్థాపనలు జరిగాయన్నారు. గచ్చిబౌలిలో నిర్మాణం చివరి దశలో ఉందని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరించడానికి, వేగవంతమైన సేవలను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.
