అక్షరటుడే, వెబ్డెస్క్: Vijayawada Kanakadurgamma Temple | విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గ అమ్మవారి దేవస్థానంలో (Durga Ammavari temple) భక్తుల కోసం కొన్ని కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. ఆలయంలో భక్తుల దుస్తుల శైలిపై పెరుగుతున్న విమర్శలు, మొబైల్ ఫోన్ల దుర్వినియోగం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాన ఈవో శీనా నాయక్ తెలిపారు.
ఇటీవల కొంతమంది భక్తులు ఆలయంలోకి మితిమీరిన మోడ్రన్ దుస్తులతో (modern clothes) రావడం, కొందరు మగవారు షార్ట్లలో దర్శనానికి రావడం మతాభిమానులు తీవ్రంగా విమర్శించారు. మహిళలు చీర లేదా చున్నీ లేకుండా రావడం కూడా ఆలయ గౌరవానికి భంగం కలిగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనితో ఆలయ పాలకవర్గం అభ్యంతరకర దుస్తులకు విరామం చెప్పాలని నిర్ణయించింది.
Vijayawada Kanakadurgamma Temple | మహిళలకు చీర/చున్నీ తప్పనిసరి
ఇకపై మహిళలు దుర్గ గుడిలోకి చీర లేదా చున్నీ (saree or chunni) ధరించకుండా ప్రవేశించలేరు. ఇతర మోడ్రన్ దుస్తుల్లో వచ్చే వారికోసం ఆలయ ప్రవేశ ద్వారాల్లో, ఘాట్ రోడ్ ఓం టర్నింగ్ వద్ద, మహా మండపం వద్ద – ప్రత్యేకంగా చున్నీలు అందుబాటులో ఉంచారు. ఈవో ప్రకారం, ఇవి కొబ్బరికాయ/పూజా సామాగ్రి కౌంటర్ల వద్ద లభిస్తాయి. షార్ట్లలో వచ్చే పురుషుల కోసం ఆలయ కౌంటర్ల వద్ద పంచెలను కూడా ఏర్పాటు చేశారు.
ఎవరికైనా తగిన దుస్తులు లేకపోతే, అక్కడే అవి ధరించి ఆలయంలోకి ప్రవేశించవచ్చు.ఇక భక్తులు, సిబ్బంది ఎవరూ మొబైల్ ఫోన్లను ఆలయంలోకి తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు. ఇటీవల కొంతమంది మొబైల్ ఫోన్ల ద్వారా అమ్మవారి చిత్రాలను దొంగతనంగా తీసి సోషల్ మీడియాల్లో (social media) పోస్ట్ చేయడం వల్ల దేవాలయ ప్రతిష్ఠకు భంగం ఏర్పడిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలయ కట్టుబాట్లపై ఈవో శీనా నాయక్ (EO Srinu Nayak) మాట్లాడుతూ.. చున్నీ లేకపోయినంత మాత్రాన ఆలయంలోకి వెళ్లకుండా వెనక్కి పంపడం మా ఉద్దేశం కాదు. కానీ ఆలయ కట్టుబాట్లను గౌరవిస్తూ, నిండుగా వస్త్రాలు ధరించి రావాలని కోరుతున్నాం. అంతరాలయ దర్శనానికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏమి లేదు గానీ, అభ్యంతర దుస్తులు మాత్రం వేసుకొని రావొద్దు అని పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు ఆలయ మర్యాదను కాపాడేలా రూపొందించబడినవి. భక్తులు ఈ మార్గదర్శకాలను గౌరవించి, ఆలయ సంప్రదాయాలను గౌరవించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.