MLC Kavitha
Kavitha | చాలా మంది బీఆర్ఎస్​ నేతలు టచ్​లో ఉన్నారు.. కొత్త పార్టీపై కవిత కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) కొత్త పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె శనివారం మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కవితను బీఆర్​ఎస్(BRS)​ నుంచి సస్పెండ్​ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కొత్త పార్టీ పెడుతారనే ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చన్నారు. అయితే తాను పార్టీ ఏర్పాటు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్(KCR)​ పార్టీ పెట్టే సమయంలో చాలా మందితో చర్చించారని చెప్పారు. తాను కూడా ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో త్వరలోనే ఆమె పార్టీ పెడుతారనే ప్రచారం జరుగుతోంది.

 Kavitha | తలుపులు తెరిచి ఉన్నాయి

కాంగ్రెస్​లో చేరుతారనే ప్రచారాన్ని ఆమె ఖండించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. కాంగ్రెస్(Congress)​ నుంచి తనను ఎవరు సంప్రదించలేదన్నారు. కాంగ్రెస్​కు మళ్లీ అధికారంలోకి వచ్చే అర్హత లేదన్నారు. తనతో టచ్​లో ఉన్న బీఆర్​ఎస్​ నేతల లిస్ట్​ చాలా పెద్దదని ఆమె చెప్పారు. ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్​నని, అన్ని తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. కాగా ఇటీవల జూబ్లీహిల్స్​ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్​ రెడ్డి కవితతో భేటీ అయ్యారు. కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్సీ అమీర్​ అలీ ఖాన్​ సైతం ఆమెతో చర్చలు జరిపారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక(Jubilee Hills by Election) కోసమే వారు ఆమెను కలిసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తనతో చాలా మంది బీఆర్​ఎస్​ నేతలు టచ్​లో ఉన్నారని కవిత వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాల్లో ఎవరు అవకాశం ఇవ్వరని.. తొక్కుకుంటూ వెళ్లాలని ఆమె వ్యాఖ్యానించారు.

 Kavitha | ఆ విషయంలోనే హరీశ్​రావుపై కోపం

కాళేశ్వరం విషయంలో తప్ప హరీశ్​రావు(Harish Rao)పై వేరే కోపం లేదని కవిత అన్నారు. హరీశ్​రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చాలా ఫైళ్లు అధికారులు చెక్​ చేయకుండా నేరుగా కేసీఆర్​ దగ్గరకు వెళ్లాయన్నారు. ఈ విషయంలో తాను 2016లోనే తాను కేటీఆర్(KTR)​ను అప్రమత్తం చేసినట్లు కవిత చెప్పారు. ఘోష్​ కమిషన్​ ఎదుట హరీశ్​రావు చాలా అంశాల్లో తనకు సంబంధం లేదని చెప్పారన్నారు. కేసీఆర్​ నిర్ణయమేనని హరీశ్​ చెప్పినట్టు నివేదికలో ఉందని కవిత పేర్కొన్నారు.