అక్షరటుడే, భీమ్గల్: Vemula Prashanth Reddy | తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) మండిపడ్డారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గురువారం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
Vemula Prashanth Reddy | హామీలను నెరవేర్చలేక..
వేముల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గం ‘దండుపాళ్యం బ్యాచ్’లా (Dandupalyam gang) మారిందని, బొగ్గు, సోలార్, ఎక్సైజ్ రంగాల్లో భారీ కుంభకోణాలకు పాల్పడుతోందని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) బయటపెట్టిన ఈ స్కామ్ల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ (KTR), హరీష్ రావులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను మానసికంగా దెబ్బతీసి, కేసుల చుట్టూ తిప్పాలనేది ప్రభుత్వ వ్యూహమని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, పెన్షన్ల పెంపుతో కోట్లాది మంది గుండెల్లో నిలిచిన నాయకుడిని అవమానిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.