అక్షరటుడే, వెబ్డెస్క్ : Asia Cup | ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ (UAE) వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బీసీసీఐ (BCCI) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ టీ20 ఫార్మాట్ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. లీగ్ మ్యాచ్లు సెప్టెంబర్ 9 నుంచి మొదలవుతుండగా, సెప్టెంబర్ 14న భారత్ – పాకిస్తాన్ (Ind-Pak) మధ్య మ్యాచ్ జరగనుండటంతో క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ – పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Atack)తో రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఫలితంగా భారత్ పాక్తో అన్ని సంబంధాలను తిరస్కరించింది.
Asia Cup | ఏం జరగనుంది?
ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత జట్టు పాకిస్థాన్తో (Pakistan) మ్యాచ్ ఆడటానికి నిరాకరించడంతో, క్రికెట్ ప్రేమికులలో అనేక ఆలోచనలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా అభిమానులు భారత్ పాక్ మ్యాచ్ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (CEO) సుభాన్ అహ్మద్ స్పందిస్తూ – “ఆసియా కప్లో భారత్ – పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఇది ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉంటుంది. WCL లాంటి ప్రైవేట్ టోర్నీలతో దీనిని పోల్చడం తగదు. ఆసియా కప్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది. జట్లు ముందుగానే అనుమతులు తీసుకుని ప్లాన్ చేస్తాయి అని తెలిపారు.
ఈసారి ఆసియా కప్లో ఎనిమిది జట్లు తలపడనున్నాయి. గ్రూప్ A: భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్, గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్. గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగతా మూడింటితో తలపడుతుంది. సూపర్ ఫోర్, ఫైనల్ దశలతో టోర్నమెంట్ ముగుస్తుంది. భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్కు చేరుకుంటే.. ఈ టోర్నీలో మూడు సార్లు ఒకదానితో ఒకటి తలపడే అవకాశముంది.
భారత్ తన తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. అయితే భారత్ – పాక్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందా లేదా అనే విషయంలో అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. కానీ మ్యాచ్ జరిగితే మాత్రం ఈ రైవల్రీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండనుంది.
