More
    Homeఆంధ్రప్రదేశ్​Illegal mining | గుట్టలు కొల్లగొట్టిన ఓఎంసీ.. అప్పట్లో సంచలనం సృష్టించిన కేసు

    Illegal mining | గుట్టలు కొల్లగొట్టిన ఓఎంసీ.. అప్పట్లో సంచలనం సృష్టించిన కేసు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : illegal mining | ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీబీఐ కోర్టు (CBI court) మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల పాటు జరిగిన విచారణ తర్వాత తుది తీర్పు వెల్లడించింది. ఓఎంసీ అక్రమ మైనింగ్‌ (OMC illegal mining) నుంచి మొదలు కేసులు, అరెస్టులు, దర్యాప్తులు, బెయిల్‌ కోసం న్యాయమూర్తికి లంచాలు, విచారణ, తుది తీర్పు వరకూ అనేక సంచలనాలకు ఓఎంసీ కుంభకోణం వేదికైంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, న్యాయమూర్తులు సైతం ఇందులో చిక్కుకోవడం దుమారం రేపింది.

    illegal mining | వైఎస్‌ హయాంలో..

    2007 జూన్‌ 18న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) హయాంలో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి (Obulapuram Mining Company) గనులను లీజుకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లీజు ఒప్పందంలో ‘క్యాప్టివ్’ పదాన్ని కావాలనే తొలగించారని, దీని వెనుక అక్రమాలు జరిగాయని భారీగా ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలో మంత్రిగా ఉన్న గాలి జనార్ధన్‌రెడ్డికి (Gali Janardhan Reddy) చెందిన ఓఎంసీకి గనులు కట్టబెట్టడం వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే, ఓఎంసీ లీజు కింద తనకు కేటాయించిన భూముల్లోనే కాకుండా అంతకు మించిన భూముల్లోనూ మైనింగ్‌ పాల్పడింది. ఈ నేపథ్యంలో ఓఎంసీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ (CBI) 2009 డిసెంబర్‌ 7న కేసు నమోదు చేసింది.

    illegal mining | పక్కా ఆధారాలతో..

    కేసు దర్యాప్తు (investigation) చేపట్టిన సీబీఐ పక్కా ఆధారాలను సేకరించింది. వాస్తవానికి 68.52 హెక్టార్లలోనే మైనింగ్‌కు లీజును పొందినప్పటికీ, 78.18 హెక్టార్లలో మైనింగ్ జరిగిందని గుర్తించింది. దీని వెనుక అప్పటి కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి (Karnataka Minister Gali Janardhan Reddy), అతని సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి కలిసి అక్రమంగా ఓబులాపురం మైనింగ్స్‌ను తవ్వి ఎగుమతి చేస్తున్నారని గుర్తించింది. ఈ కేసులో వారిద్దరితో పాటు అప్పటి గనుల శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabita Indra Reddy), ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి (IAS officer Srilakshmi) సహా పలువురి పేర్లను చార్జిషీట్‌లో చేర్చింది. గాలి సోదరులు అక్రమంగా చేసిన మైనింగ్‌ వల్ల దాదాపు రూ.844 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందని సీబీఐ చార్జీ షీట్ (chargesheet) తెలిపింది. ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. వారి ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని ఈకేసులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి.

    illegal mining | సబిత తప్ప అందరూ అరెస్టు..

    ఈ కేసులో ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి)కింద సీబీఐ అధికారులు (CBI officials) అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించారు. ఓఎంసీ కేసులో ఒక్క సబితాఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) మినహా మిగతా నిందితులందరినీ సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపింది. గాలి జనార్ధాన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలత, వీడీ రాజగోపాల్, కృపానందం, అలీ ఖాన్ తదితరులు అరెస్టయ్యారు. దాదాపు 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత నాలుగు చార్జ్షీట్లను సీబీఐ కోర్టు ముందు సీబీఐ అధికారులు (CBI officials) సమర్పించారు.

    illegal mining | సుదీర్ఘ విచారణ..

    చార్జిషీట్‌ దాఖలు తర్వాత నాంపల్లిలోని సీబీఐ కోర్టు (Nampally CBI court) సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. నిందితులు బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ కోసం అప్పట్లో జరిగిన ఓ ఉదంతం న్యాయ వ్యవస్థకు మచ్చతెచ్చింది. గాలి సోదరులు, శ్రీలత సహా మిగిలిన నిందితులకు బెయిల్‌ రావడానికి సంవత్సరాలు పట్టింది. మరోవైపు సీబీఐ సేకరించిన మొత్తం డాక్యుమెంట్ ఎవిడేషన్ ను న్యాయస్థానం ముందు పెట్టింది. డాక్యుమెంట్ ఎవిడేషన్ కింది దాదాపు 3337 డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచింది. సాక్షుల స్టేట్మెంట్లు, డాక్యుమెంట్లను వెరిఫై చేసిన తర్వాత న్యాయస్థానం దోషులకు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో సబిత, కృపానందం పాత్ర లేదని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

    illegal mining | ఏడేళ్ల జైలు..

    ఓఎంసీ కేసులో (OMC case) ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు (CBI court) ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఏ3 వీ.డీ రాజగోపాల్, ఏ7 అలీ ఖాన్లకు ఈ మేరకు శిక్ష పడింది. 14 ఏళ్ల పాటు విచారణ అనంతరం సీబీఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఏ1, ఏ2లకు ఏడేళ్ల పాటు శిక్షలు ఖరారు అయ్యాయి. వీడీ రాజ్‌గోపాల్‌కు అదనంగా నాలుగేళ్లు శిక్ష విధించింది. భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా (Director of Underground Mines Department) ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనపు శిక్షను ఖరారు చేసింది. మొత్తంగా ఆయనకు 11 ఏళ్ల జైలు శిక్ష పడింది.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...