అక్షరటుడే, వెబ్డెస్క్: MP Arvind Fires on Congress | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఓ కాంగ్రెస్ అభ్యర్థిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని గెలిపిస్తే నగరాన్ని దోచుకుంటారన్నారు. బుధవారం పార్టీ కార్యాలయం (Party Office)లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలప్పుడు బీజేపీ (BJP)కి హిందుత్వం, ఇందూరు గుర్తుకు వస్తాయని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. దీనికి ఎంపీ అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. హిందుత్వం తమ డీఎన్ఏ అన్నారు. అది తమ జీవన విధానం అని చెప్పారు. హిందుత్వం కోసం తాము రాజకీయాలు చేయమన్నారు. కాంగ్రెస్ అవినీతి కోసం రాజకీయాలు చేస్తోందన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ (Nizamabad Congress)లో పరిణితి చెందిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.
MP Arvind Fires on Congress | రూ.8.16 కోట్లు ఎలా కట్టారు
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఎవరని అర్వింద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత నరేందర్ రెడ్డి అని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. 2009 నుంచి ఓ భవనానికి సంబంధించిన భారీ ఆస్తి పన్నును నరేందర్రెడ్డి కట్టలేదన్నారు. రూ.8.16 కోట్ల ఆస్తి పన్ను ఇన్ని రోజులు కట్టించేవారు లేరా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం ఆ బకాయిలు కట్టారన్నారు. మున్సిపల్ అధికారులను (Municipal Officers) మేనేజ్ చేసుకుంటూ ఇన్ని రోజులు పన్ను కట్టలేదని విమర్శించారు. ఆయన ఇన్ని రోజులు పైసలు లేక కాదని నిజాయితీ లేక డబ్బులు కట్టలేదన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒకేసారి రూ.8.16 కోట్ల బకాయిలు చెల్లించారన్నారు. అంత డబ్బు ఒకేసారి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాంటి వారు నగర మేయర్ అయితే నిలువు దోపిడీ చేస్తారని ఆరోపించారు. మన పర తేడా లేకుండా అందరినీ దోచుకుంటారన్నారు.
MP Arvind Fires on Congress | రాముడే కాపాడాలి
కాంగ్రెస్ అభ్యర్థి 17 ఏళ్లుగా కట్టని బకాయిలను 17 గంటల్లో ఎలా కట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానంతో మేయర్ పదవిపై డీల్ మాట్లాడుకొని పన్ను కట్టారన్నారు. ఇన్ని రోజుల పన్నులు కట్టని వ్యక్తి మేయర్ అయితే ఇందూరు మున్సిపాలిటీ (Indur Municipality)ని శ్రీరాముడే కాపాడాలన్నారు. నరేందర్రెడ్డికి నైతికత, బాధ్యత లేదు అన్నారు. ఇలాంటి వారిని ఓటుతో శిక్షించాలన్నారు. 19వ డివిజన్లో కాంగ్రెస్కు డిపాజిట్ రాకుండా చేయాలని ఆయన కోరారు. 59 వార్డుల్లో కాంగ్రెస్కు డిపాజిట్ ఇచ్చిన సరే కానీ.. 19వ వార్డులో మాత్రం ఇవ్వొద్దని ఆయన ప్రజలను కోరారు. 19వ వార్డు నుంచి నరేందర్రెడ్డి భార్య శమంత రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 17 ఏళ్లుగా నగర ప్రజలను మోసం చేసిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదన్నారు.
MP Arvind Fires on Congress | నగరాన్ని అభివృద్ధి చేస్తాం
కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ కావడంతోనే తాను బీజేపీలో చేరానన్నారు. తన తండ్రి డీఎస్ను అవమానించి పార్టీ నుంచి బయటకు పంపారన్నారు. తాము గెలిస్తే నగర అభివృద్ధి కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి రూపాయిని ప్రజల సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తామన్నారు. బీజేపీలో అవినీతి ఆరోపణలు ఉన్న వారికి టికెట్లు ఇవ్వలేదని ఎంపీ వెల్లడించారు. 18 మంది సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వలేదని చెప్పారు. రిజర్వేషన్లతో కొంతమందికి, అవినీతి ఆరోపణలతో మరికొందరికి టికెట్లు నిరాకరించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్కు, ఎంఐఎం మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. నగరంలో కాంగ్రెస్ తమకు పోటీ కాదన్నారు. బీజేపీ టికెట్లు ఇవ్వని వారికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందన్నారు. తమ మేయర్ అభ్యర్థిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయిస్తారన్నారు. తాము గెలిస్తే అందరి దగ్గర ఆస్తి పన్ను బకాయిలు వసూలు చేస్తామన్నారు. ప్రముఖ హోటళ్లను సైతం వదిలిపెట్టమని స్పష్టం చేశారు.