Homeతాజావార్తలుHydraa | రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Hydraa | రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

పోచారం మున్సిపాలిటీ పరిధిలో 4 వేల గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. పార్క్​ స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించగా.. అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో నాలుగు వేల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా (Hydraa) కాపాడింది. దీని విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

డాక్టర్స్​ కాలనీ (Doctors Colony)లో 1985లో 26.9 ఎకరాల పరిధిలో 500 ప్లాట్లతో లే అవుట్​ వేశారు. ఆ సమయంలో పార్క్​ కోసం నాలుగు వేల గజాల స్థలాన్ని విడిచిపెట్టారు. అనంతరం ఆ స్థలాన్ని భూ యజమానులే ఆక్రమించారు. ఈ విషయమై చౌదరిగూడలోని డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) గారి ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదును హైడ్రా అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Hydraa | తప్పుడు పత్రాలతో..

లే అవుట్ (Layout) వేసినప్పుడు 4 వేల గజాల స్థలాన్ని పార్కుగా చూపించారు. లే అవుట్​ వేసిన వారి కుటుంబ సభ్యుల్లో ఆముదాల నరసింహ కొడుకు ఆముదాల రమేష్ తప్పుడు డాక్యుమెంట్స్​తో ఆ స్థలాన్ని 5 ప్లాట్లుగా కులకర్ణి అనే వ్యక్తికి అమ్మేశాడు. కులకర్ణి అనే వ్యక్తి వాటిని 200 గజాల చొప్పున 20 ప్లాట్లుగా చేసి రాజేష్, సోమాని తో పాటు పలువురికి విక్రయించాడు. ఈ విషయమై కాలనీ అసోసియేషన్​ ప్రతినిధులు ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా హైడ్రా ప్రజావాణి (Prajavani)లో ఫిర్యాదు చేయగా.. సమస్యకు పరిష్కారం లభించింది.విచారణ పూర్తి చేసి.. పార్కు స్థలంగా నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు శుక్రవారం ఆక్రమణలు తొలగించారు. 4 వేల గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.