అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైడ్రా అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణలను కూల్చి వేస్తున్నారు. తాజాగా మేడ్చల్-తూంకుంట పరిధిలోని దేవరయాంజల్ (Devrayanjal)లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
దేవరయాంజల్లో నాలాపై ప్రహరీ నిర్మించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలతో వర్షం పడినప్పుడు తమ కాలనీలు నీట మునుగుతున్నాయని వాపోయారు. ఈ మేరకు హైడ్రా అధికారులు (Hydraa Officers) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆక్రమణలు నిజమేనని తేలడంతో మంగళవారం కూల్చివేతలు చేపట్టారు దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Hydraa | ఫిర్యాదుల వెల్లువ
ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదులను అధికారులు స్వీకరిస్తున్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు చేపడుతున్నారు. అధికారులు వేగంగా స్పందిస్తుండటంతో భారీగా ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువులు, నాలాలు, పార్క్ల ఆక్రమణలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి (Prajavani)కి మొత్తం 61 ఫిర్యాదులు వచ్చాయి.
రంగారెడ్డి జిల్లా (Rangareddy District) బాలాపూర్ మండలంలోని మల్లాపూర్ విలేజ్లో ఏ ఎం ఆర్ టౌన్షిప్లో 2 పార్కులతో పాటు.. రెండు రహదారులను ఆక్రమించేశారంటూ టౌన్షిప్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం సాయినగర్ కాలనీలో నాలా పక్కన ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడ సర్వే నంబరు 44, 45లో పాఠశాల భవనానికి కేటాయించిన 1967 గజాల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురి అవుతోందని శ్రీ వెంకట సాయి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.
