అక్షరటుడే, వెబ్డెస్క్: Vizhinjam Seaport | ప్రపంచంలోనే అతిపెద్దదైన కంటెయినర్ నౌకలలో ఒకటైన ఎమ్మెస్సీ ఇరినా(MSC IRINA) తొలిసారిగా మన దేశంలోని కేరళలో ఉన్న విజింజం అంతర్జాతీయ సీపోర్ట్(Vizhinjam International Seaport)కు వచ్చింది. ఇక్కడ కంటెయినర్లను లోడ్, అన్లోడ్ చేశారు. మెగా కంటెయినర్ షిప్ రావడం విజింజం ఓడరేవులో ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
విజింజం ఓడరేవు భారతదేశంలోనే మొట్టమొదటి డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్(Deep water port) ట్రాన్సషిప్మెంట్. ఇది అతిపెద్ద కంటెయినర్ ఓడలను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది. దీనిని అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి కేరళ ప్రభుత్వంతో అదానీ గ్రూప్(Adani group) 40 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. 2028లో ఈ ఓడరేవు అభివృద్ధి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఓడరేవు ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వాణిజ్య అభివృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీని అభివృద్ధి పూర్తయితే దుబాయి, కొలంబో, సింగపూర్ వంటి ఇతర ప్రధాన ఆసియా(Asia) ఓడరేవులపై మన దేశం ఆధారపడడం తగ్గుతుంది.
విజింజం ఓడరేవు ద్వారా షిప్పింగ్ సమయం, ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా గ్లోబల్ షిప్పింగ్(Global shipping) నెట్వర్క్లో మనదేశం పాత్ర కూడా పెరుగుతుంది. భారత కంటెయినర్ ట్రాన్స్షిప్మెంట్ అవసరాలలో 50 శాతాన్ని ఈ ఓడరేవు తీరుస్తుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చేసిన తర్వాత ఆసియా -యూరోప్(Europe) వాణిజ్య మార్గంలో కీలక హబ్గా మారే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెస్సీ ఇరినా వంటి మెగా కంటెయినర్ షిప్ రావడం ఈ ఓడరేవు సామర్థ్యాన్ని పరీక్షించడానికి, గ్లోబల్ షిప్పింగ్ మ్యాప్లో చేర్చడంలో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ నౌకను నడిపింది కేరళ(Kerala)కు చెందిన కెప్టెన్ విల్లీ ఆంటోనీ.
ఇటీవల తుర్కియే(Turkey)కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద కంటెయినర్ నౌకలలో ఒకటైన ఎంఎస్సీ తుర్కియే సైతం విజింజం నౌకాశ్రయానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇది దక్షిణాసియాలోని ఓడరేవుకు రావడం తొలిసారి కావడం గమనార్హం. ఇలా వరుసగా భారీ నౌకలు ఇక్కడికి వస్తుండడం భారత షిప్పింగ్, లాజిస్టిక్స్ ల్యాండ్స్కేప్లో మైలురాళ్లుగా నిలుస్తాయని భావిస్తున్నారు.