అక్షరటుడే, వెబ్డెస్క్: Holi Special Trains | రైల్వే శాఖ (Railway Department) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,244 స్పెషల్ ట్రైన్లు వేస్తామని పేర్కొంది.
దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు సైతం స్వగ్రామాలకు వెళ్తుంటారు. దీంతో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో రైల్వేశాఖ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు తెలిపింది. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు వివిధ జోన్లలో 1,244 ప్రత్యేక ట్రిప్పులు వేస్తామని తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 16 ప్రత్యేక రైళ్లు 40 ట్రిప్పులు నడవనున్నాయి. చర్లపల్లి, తిరుపతి, సికింద్రాబాద్, చంద్రపూర్ నుంచి ఉత్తర, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రద్దీ అధికంగా ఉంటే.. ఈ ట్రిప్పుల సంఖ్యను 1,500కు పెంచే అవకాశం ఉంది.
Holi Special Trains | ప్రధాన నగరాలు..
సాధారణ రైళ్లలో రద్దీని తగ్గించడానికి అదనపు సర్వీసులను ప్లాన్ చేశారు. హోలీ స్పెషల్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, రాష్ట్ర రాజధానులు, కీలక ప్రాంతీయ కేంద్రాలను కలుపుతాయి. సుదూర ప్రత్యేక సర్వీసులు ముంబై, పూణే, నాగ్పూర్ వంటి ప్రధాన కేంద్రాలను దానాపూర్, గోరఖ్పూర్, హజ్రత్ నిజాముద్దీన్, సమస్తిపూర్, బరౌని వంటి గమ్యస్థానాలతో కలుపుతాయి. విశాఖపట్నం, పూరి, భువనేశ్వర్ వంటి తూర్పు, తీరప్రాంత కేంద్రాలు షాలిమార్, పాట్నా, యశ్వంత్పూర్ ధన్బాద్లకు అనుసంధానం అవుతాయి. తూర్పు, ఉత్తర కారిడార్లలో కూడా మెరుగైన కనెక్టివిటీని ప్లాన్ చేశారు.
హోలీ స్పెషల్ రైళ్లు దక్షిణాదిలోని చెన్నై, ఎర్నాకులం, తిరువనంతపురం, కోయంబత్తూర్, సికింద్రాబాద్, తిరుపతి, బెంగళూరు నుంచి పాట్నా, బరౌని, ముజఫర్పూర్, సంత్రాగచి, అజ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాలకు వేశారు. ప్రయాణికులు రైల్వే సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. అవసరం అయితే మరిన్ని సర్వీసులు వేస్తామని ప్రకటించారు.
