అక్షరటుడే, ఆర్మూర్: Sriram sagar | గత నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలతో తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 1,05,000క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. గత రెండు మూడు రోజులు ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 5 టీఎంసీల వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరింది.
Sriram sagar | అన్నదాతల హర్షం
ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 టీఎంసీలు (1091 అడుగులు) కాగా ప్రస్తుతం 32.897 టీఎంసీలకు (1075 అడుగులు) చేరింది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తోంది. మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు 89,812 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. 6 గంటల తర్వాత 75,754 క్యూసెక్కులకు పెరిగింది. ఆ తర్వాత 1,05,000 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఆవిరి రూపంలో 407 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గత యేడు ఇదే సమయానికి ప్రాజెక్టులో 1075.2 అడుగులు, 33.317 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలో భారీగా వరద వచ్చిచేరడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వరద కొనసాగితే పంటల సాగుకు ఢోకా ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.