అక్షరటుడే, బాన్సువాడ: Vinayaka Chavithi | వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Banswada Sub-Collector Kiranmayi) సూచించారు.
బాన్సువాడలో (Banswada) సోమవారం నిర్వహించిన పీస్ కమిటీ (Peace Committee) సమావేశంలో మాట్లాడారు. ఊరూరా, కాలనీవారీగా ఏర్పాటయ్యే మండపాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, పోలీసులు సూచించే మార్గదర్శకాలు పాటించాలని తెలిపారు.
పండుగలు ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను జరుపుకోవాలని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటు, మైక్ల వినియోగం, నిమజ్జన కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. శబ్ధకాలుష్యం, పర్యావరణ కాలుష్యం లేకుండా ఉత్సవాలను జరుపుకోవాలని, నిమజ్జన సమయంలో ట్రాఫిక్ అంతరాయాలు రాకుండా పోలీసులు, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
రాత్రి వేళల్లో అనవసరంగా మైక్ల వాడకాన్ని నివారించాలని సూచించారు. అన్ని మతాల వారందరూ సహకారం అందిస్తే పండుగలు విజయవంతంగా జరుగుతాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ విఠల్ రెడ్డి (DSP Vittal Reddy), సీఐలు అశోక్, తిరుపతయ్య, మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.