అక్షరటుడే, వెబ్డెస్క్ : Rythubandhu | రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి బీఆర్ఎస్ (BRS) హయాంలో రైతు బంధు పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారు.
రైతులకు చేయూత అందించడానికి నాటి సీఎం కేసీఆర్ (KCR) రైతు బంధు పథకం ప్రవేశపెట్టారు. తొలుత ఎకరానికి రూ.నాలుగు వేలు అందించారు. అనంతరం దానిని రూ.5 వేలకు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు పేరును రైతు భరోసా (Rythu Bharosa)గా మార్చి ఎకరాకు రూ.6 వేలు అందిస్తోంది. అయితే భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందాలి. కానీ కొందరికి అసలు భూమి లేకున్నా.. రికార్డుల్లో భూములను సృష్టించి అక్రమంగా రైతు బంధు పొందారు.
Rythubandhu | భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో..
కేసీఆర్ హయాంలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారు. అప్పటి వరకు ఉన్న భూములు రికార్డులను తారుమారు చేశారు. నల్గొండ (Nalgonda) జిల్లా తిరుమలగిరి మండలంలో కొందరు భూములు లేకున్నా పాస్బుక్లు పొందారు. 2017కు ముందు వారి పేరిట ఎలాంటి భూమి లేదు. అనంతరం వారు కొత్తగా భూమి కొనుగోలు చేయలేదు. వారసత్వంగా కూడా బదిలీ కాలేదు. కానీ 3,069 మంది భూ యజమానులుగా మారిపోయారు. 2,936 ఎకరాలకు హక్కులు పొందగా.. పట్టా పాస్బుక్లు కూడా వచ్చాయి. ఈ భూములు ధరణి (Dharani)లో నమోదు కావడంతో రైతు బంధు కూడా జమ అవుతోంది.
Rythubandhu | సర్వేలో వెలుగులోకి..
బీఆర్ఎస్ హయంలో గుట్టలు, వెంచర్లు, రోడ్లకు కూడా రైతు బంధు జమ చేశారని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతుబంధుపై సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమలగిరి మండలంలో ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టగా.. నకిలీ పట్టాల దందా వెలుగు చూసింది. మండలంలోని నెల్లికల్, చింతపాలెం, తిమ్మాయిపాలెం గ్రామాల శివారులో అటవీ భూములు ఉన్నాయి. వీటిని కొందరు సాగు చేసుకుంటున్నారు. అయితే సాగు చేసుకొని వారు సైతం పట్టాలు పొందడం గమనార్హం. రికార్డుల్లో తమ పేర్లు లేకున్నా.. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ఆన్లైన్లో ఎక్కేలా చూసుకున్నారు.
Rythubandhu | అధికారుల హస్తం!
అక్రమ పట్టాల విషయం వెలుగు చూడటంతో ప్రభుత్వం ఆ భూములకు రైతు బంధు నిలిపి వేసింది. తాజాగా ఆయా పట్టాలను సైతం రద్దు చేసింది. అయితే ఈ వ్యవహారంలో అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు తెలియకుండా భూములు రికార్డుల్లో ఎక్కే ఛాన్స్ లేదు. భూమి కొత్తగా నమోదు చేయాలంటే సంబంధిత పత్రాలు కావాల్సి ఉంటుంది. అయితే అవేమి లేకుండానే అధికారులు వేల ఎకరాలకు పట్టాలు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఎవరు ఉన్నారనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే చాలా జిల్లాల్లో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు సమాచారం. కొత్తగా రికార్డుల్లోకి ఎక్కిన భూముల వివరాలపై సర్వే చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.