అక్షరటుడే, కామారెడ్డి: Additional Collector Madhu Mohan | మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ (Additional Collector Madhu Mohan) సూచించారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం కౌన్సిలర్ అభ్యర్థులతో (councillor candidates) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు చేసిన ఎన్నికల ఖర్చులన్నింటినీ ప్రతిరోజూ కచ్చితంగా లెక్కల్లో నమోదు చేయాలని సూచించారు.
రిటర్నింగ్ అధికారి అందజేసిన ఖర్చుల రిజిస్టర్లో బిల్లులు, వోచర్లు, రశీదులతో సహా నమోదు చేయాలన్నారు. నిర్ణీత తేదీల్లో ఖర్చుల ఖాతాలను వ్యయ పరిశీలకుడు లేదా అధీకృత అధికారికి తనిఖీ కోసం సమర్పించాలని పేర్కొన్నారు. ప్రచారం కోసం వాహనాల వినియోగం, లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఊరేగింపులు నిర్వహించేందుకు ముందస్తుగా రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా వాహనాలు, లౌడ్ స్పీకర్లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను నిర్ణీత ఫార్మాట్లలో నియమించుకుని, రిటర్నింగ్ అధికారి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే విధులు నిర్వహించాలని తెలిపారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు జారీ చేసే సూచనలు, ప్రవర్తనా నియమావళిని పాటించాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత వ్యవధిలోపు ఎన్నికల వ్యయ ఖాతాల తుది లెక్కలను సమర్పించాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలపై ఏవైనా సందేహాలుంటే రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, ఎన్నికల అధికారులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.