అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండల కేంద్రాల్లో మల్టీ క్రీడా స్టేడియాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) తెలిపారు. మండలంలోని శివనగర్ గ్రామ శివారులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
Yellareddy MLA | క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో..
సీఎం కప్–2025లో (CM Cup-2025) భాగంగా గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పల్లె ప్రాంతాల యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా సాధ్యమవుతుందన్నారు. తాము ఎంచుకున్న క్రీడల్లో కష్టపడి శ్రమిస్తే పల్లెస్థాయి నుంచి జాతీయ స్థాయి ఛాంపియన్లుగా ఎదగవచ్చని తెలిపారు.
ప్రతిభను ప్రదర్శించే అవకాశం..
సీఎం కప్ క్రీడల ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికను కల్పించిందని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ యువత రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ నిరుపేద కుటుంబం నుంచి ఎదిగి ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడని గుర్తు చేశారు. మెస్సీ ఆడిన మ్యాచ్ను వీక్షించేందుకు తనకు వచ్చిన టికెట్లను రామారెడ్డి ప్రాంత విద్యార్థులకు అందించి మ్యాచ్కు పంపినట్లు తెలిపారు. మారుమూల ఎల్లారెడ్డిని మోడల్ ఎల్లారెడ్డిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి, ఫిజికల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.