అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | వేల్పూర్ మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పీహెచ్సీ, సహకార సంఘం ఎరువుల గోడౌన్లను సందర్శించారు. పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నేషన్ విధానం (Face Recognition System) ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. సాంకేతిక ఇబ్బంది కారణంగా కొంతమంది విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నమోదు కావడం లేదని పాఠశాల హెచ్ఎం రాజన్న తెలపగా, కలెక్టర్ తన సమక్షంలోనే ఎఫ్ఆర్ఎస్ పద్ధతిన విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేయించారు. ముఖ గుర్తింపు హాజరు విధానం సంపూర్ణంగా అమలు అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.
Collector Nizamabad | బోధనాతీరు పరిశీలన..
తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధిస్తున్న
తీరును కలెక్టర్ గమనించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి, అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంట గది, మద్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం, ఉడకబెట్టిన కోడి గుడ్డును అందించాలని ఆదేశించారు.
Collector Nizamabad | పీహెచ్సీలో వైద్యసేవలపై ఆరా..
అంతకుముందు కలెక్టర్ వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Velpur Primary Health Center) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. కాన్పులు చేసేందుకు వీలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నందున గర్భిణులు స్థానికంగానే ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణకు (Medical Officer Dr. Veena) సూచించారు. జాతీయ నులి పురుగు నివారణ మాత్రల పంపిణీ, వ్యాక్సినేషన్, గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.
లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు వంటివి జరుగకుండా గట్టి నిఘా ఉంచాలని, ఏదైనా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పైఅధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పీహెచ్సీలలో బేబీ వార్మర్లు (Baby Warmers) పనిచేయడం లేదని తెలుసుకున్న కలెక్టర్, టీజీఎంఎస్ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను వెంటనే ఫోన్చేసి అన్ని పీహెచ్సీల్లో బేబీ వార్మర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ నిల్వలను పరిశీలించారు. ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును రైతులకు కనిపించే విధంగా ప్రదర్శించాలని, పూర్తిస్థాయిలో అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల పంపిణీ సమయంలో టోకెన్ పద్ధతి, క్యూ విధానాలను అమలు చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.
తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో (Bhubharati Revenue Conference) వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యుల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారని తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయాన్ని (MPDO Office) సందర్శించిన కలెక్టర్, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో బాలకిషన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారా అని ఆరా తీసిన కలెక్టర్ ఆన్లైన్ వివరాలను పరిశీలించారు. ప్రజాపాలన సేవా కేంద్రం కొనసాగుతున్నట్లు ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.