అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajasthan | ఏ పని చేయకుండానే ఓ మహిళ ఏకంగా రెండు కంపెనీల నుంచి జీతం అందుకుంది. ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాకుండా రూ.37 లక్షల జీతం తీసుకుంది. ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.
ప్రస్తుతం చాలా మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పొట్ట కూటి కోసం అనేక కష్టాలు పడుతున్నారు. అయితే కొందరు అధికారులు మాత్రం లక్షల రూపాయల జీతం వస్తున్నా అవినీతికి పాల్పడుతున్నారు. లంచాలు తీసుకుంటూ ప్రజలను పట్టిపీడిస్తున్నారు. డబ్బులు తీసుకొని పలు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు. ఇలాగే ఓ అధికారి రాజస్థాన్ (Rajasthan)లో రెండు కంపెనీలకు టెండర్లు అప్పగించినందుకు తన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని షరతు పెట్టాడు. దీంతో ఆమె విధులకు వెళ్లకున్నా సదరు కంపెనీలు జీతం చెల్లించాయి.
Rajasthan | ఇలా బయట పడింది
రాజస్థాన్ ప్రభుత్వం (Rajasthan Government) ఆధ్వర్యంలోని రాజ్కంప్ ఇన్ఫో సర్వీసెస్లో ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్గా ప్రద్యుమ్నా దీక్షిత్ పని చేస్తున్నారు. ఓరియన్ ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ (Treegen Software Limited) అనే సంస్థలకు ప్రభుత్వ టెండర్లు అప్పగించినందుకు దీక్షిత్ తన భార్యను ఆయా కంపెనీలలో ఉద్యోగిగా పెట్టుకోవాలని షరతు పెట్టాడు. దీంతో ఆయా సంస్థలు ప్రద్యుమ్నా భార్య పూనమ్ దీక్షిత్ తమ దగ్గర పని చేస్తున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించాయి. అంతేగాకుండా ప్రతి నెలా జీతం సైతం చెల్లించాయి. రెండేళ్లలో ఆమె మొత్తం రూ.37లక్షలు వేతనం రూపంలో ఆ కంపెనీల నుంచి పొందింది. ఓ వ్యక్తి హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ అక్రమ బాగోతం బయటకు వచ్చింది.
Rajasthan | విచారణలో కీలక విషయాలు
పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం దర్యాప్తు చేయాలని ఏసీబీ (ACB)ని ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా సదరు అధికారి భార్య రెండు కంపెనీల్లో ఉద్యోగిగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆమె ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాలేదని తేల్చారు. పూనమ్ దీక్షిత్ ఆయా కంపెనీలలో పని చేస్తున్నట్లు ఫేక్ అటెండెన్స్ నివేదికలకు ప్రద్యుమ్నా దీక్షిత్ స్వయంగా ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు.

