అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | రాత్రి పూట ఒంటరిగా బైక్పై వెళ్తున్న యువకుడిని ఓ మహిళ లిఫ్ట్ అడిగింది. పాపం అని లిఫ్ట్ ఇస్తే సదరు మహిళ మరో వ్యక్తితో కలిసి యువకుడిని దారి దోపిడీ చేసింది. ఈ ఘటన కామారెడ్డిలో ఈ నెల 10న చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డి పట్టణ సీఐ నరహరి (Kamareddy Town CI Narahari) తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన రాజు అనే ప్యారడైజ్ హోటల్లో పని చేస్తుంటాడు. ఈ నెల 10న రాత్రి 10:45 సమయంలో పని ముగించుకుని ఇంటికి బయలు దేరాడు. పట్టణంలోని సీఎస్ఐ చర్చి (CSI Church) వద్ద ఓ మహిళ ఆయనను ఆపింది. తాను కూడా సరంపల్లి వెళ్తున్నానని, అక్కడి దాక లిఫ్ట్ (Lift) ఇవ్వాలని కోరగా సరేనని బైకుపై ఎక్కించుకున్నాడు. కామారెడ్డి పట్టణం దాటి ఈఎస్ఆర్ గార్డెన్ వద్దకు రాగానే వెనకాలే మరొక బైకుపై వచ్చిన వ్యక్తి రాజు బైక్ను ఆపారు. సదరు వ్యక్తి, లిఫ్ట్ అడిగిన మహిళ ఇద్దరు కలిసి రాజును కొట్టారు. అతడి జేబులో ఉన్న రూ.2 వేల నగదు, ఫోన్ తీసుకొని పారిపోయారు. బాధితుడు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Kamareddy | గతంలో సైతం..
లిఫ్ట్ అడిగి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 18న సైతం ఇలాంటి ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. దోమకొండ (Domakonda) మండలం చింతమానుపల్లికి చెందిన ఓ వ్యక్తి కామారెడ్డి నుంచి వెళ్తుండగా ఓ మహిళ లిఫ్ట్ అడిగింది. మార్గమధ్యలో ఆ మహిళ బైక్ ఆపమని చెప్పింది. బండి ఆపిన వెంటనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకడు తన భార్యను వెహికల్పై ఎందుకు ఎక్కించుకున్నావని బెదిరించాడు. అంతేకాకుండా అతని వద్ద ఉన్న రూ.28 వేల నగదు, పర్సు లాక్కొని పారిపోయారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Kamareddy | తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దు
లిఫ్ట్ పేరిట దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలు ఇటీవల రెచ్చిపోతున్నాయి. దీంతో గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట ఎవరైనా లిఫ్ట్ కోస వాహనాలు ఆపితే.. ఆపకుండా వెళ్లాలని చెబుతున్నారు. పగటి పూట సైతం రద్దీ లేని మార్గాల్లో ఎవరికి లిఫ్ట్ ఇవ్వొద్దని హెచ్చరించారు.